శుభ్మన్ గిల్ ఔట్..
తొలి టీ20 పరాజయానికి పిచ్ను సాకుగా చూపించిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. బౌలింగ్లో అదనంగా 25 పరుగులివ్వడం కూడా విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. అలాగే సరైన ఆరంభం లభించకపోవడంతో లక్ష్యాన్ని అందుకోలేకపోయామని మ్యాచ్ అనంతరం తెలిపాడు. ఈ క్రమంలోనే టీమ్కాంబినేషన్ మార్చే ప్రయత్నం రాహుల్ ద్రవిడ్, హార్దిక్ పాండ్యా చేసే అవకాశాలున్నాయి.
టీ20ల్లో వరుసగా విఫలమవుతున్న శుభ్మన్ గిల్ను పక్కనపెట్టి పృథ్వీ షాను ఆడించే ప్రయత్నం చేయవచ్చు. వన్డే ఫార్మాట్లో వరుస సెంచరీలతో శుభ్మన్ సూపర్ ఫామ్లో ఉన్నా.. అతని శైలి టీ20లకు సెట్ అవ్వదనే అభిప్రాయం ఉంది. పవర్ ప్లేలో అటాకింగ్ గేమ్ ఆడాల్సిన టీ20ల్లో శుభ్మన్ నెమ్మదిగా ఆడటం టీమ్ విజయవకాశాలను దెబ్బతీస్తోంది. ఈ క్రమంలోనే సెహ్వాగ్ తరహాలో ఆడే పృథ్వీ షాను జట్టులోకి తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అర్ష్దీప్ సింగ్పై వేటు..
చివరి ఓవర్లో 27 పరుగులు ఇచ్చి భారత ఓటమికి కారణమైన అర్ష్దీప్ సింగ్ను కూడా పక్కనపెట్టే అవకాశం ఉంది. టీ20 ప్రపంచకప్ తర్వాత అర్ష్దీప్ సింగ్ దారుణంగా విఫలమవుతున్నాడు. శ్రీలంకతో టీ20 సిరీస్లోనూ ఒకే మ్యాచ్ ఐదు నోబాల్స్ వేసి భారత్ ఓటమికి కారణమైన అర్ష్దీప్.. న్యూజిలాండ్తోనూ దారుణంగా విఫలమయ్యాడు.
ఆఖరి ఓవర్లో నోబాల్ వేయడంతో పాటు ధారళంగా పరుగులివ్వడం భారత్ పతనాన్ని శాసించింది. అర్ష్దీప్ సింగ్ స్థానంలో యువ పేసర్ ముఖేశ్ కుమార్ను తీసుకోవచ్చు. లేకుంటే లక్నో పిచ్ స్పిన్కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో ఎక్స్ట్రా స్పిన్నర్గా యుజ్వేంద్ర చాహల్ను జట్టులోకి తీసుకురావచ్చు.
ఇషాన్, హుడాకు లాస్ట్ చాన్స్..
బంగ్లాదేశ్ పర్యటనలో డబుల్ సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించిన ఇషాన్ కిషన్.. ఆ ఇన్నింగ్స్ తర్వాత చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి ఆడలేదు. తొలి టీ20లోనూ దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే రెండో టీ20లో అతను రాణించడం చాలా ముఖ్యం. రాహుల్ త్రిపాఠి సైతం తీవ్రంగా నిరాశపరిచాడు.
డకౌట్గా వెనుదిరగడం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది. సూర్య తన ఫామ్ కొనసాగించినా.. కీలక సమయంలో ఔటయ్యాడు. అతను కూడా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం అటు బ్యాట్, ఇటు బంతితో మెరవాల్సి ఉంది. జట్టును ఆదుకోవాల్సిన స్థితిలో వికెట్ పారేసుకున్న దీపక్ హుడా కూడా రాణించాల్సిన అవసరం ఉంది.
ఉమ్రాన్ మాలిక్ సైతం..
ఉమ్రాన్ మాలిక్ సైతం బాధ్యతాయుతంగా బౌలింగ్ చేయాల్సి ఉంది. ముఖ్యంగా పరుగులివ్వకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాలి. ఉమ్రాన్ మాలిక్ను కూడా జట్టు నుంచి తప్పించాలని వసీం జాఫర్ వంటి మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.
తొలి టీ20లో కుల్దీప్ యాదవ్ పర్వాలేదనిపించినా స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ఒక వాషింగ్టన్ సుందర్ ఒక్కడే సత్తా చాటాడు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో అదరగొట్టాడు. తమ ఆటగాళ్లకు అండగా ఉండాలని హార్దిక్ పాండ్యా భావిస్తే మాత్రం భారత జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.
భారత తుది జట్టు (అంచనా)
ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్/పృథ్వీ షా, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, అర్ష్దీప్ సింగ్/యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్