కేఎస్ భరత్కు చాన్స్..
రోహిత్ శర్మ కరోనా వైరస్ బారిన పడ్డాడని తెలిపిన బీసీసీఐ.. అతని హెల్త్ అప్డేట్ను మాత్రం వెల్లడించలేదు. ఈ క్రమంలోనే అతను ఈ ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడటం సందేహంగా మారింది. ఇప్పటికే అతనికి బ్యాకప్గా మయాంక్ అగర్వాల్ను ఇంగ్లండ్ రప్పించిన టీమ్మేనేజ్మెంట్.. టీమ్ కాంబినేషన్పై దృష్టిసారించింది. రోహిత్కు బ్యాకప్గా మయాంక్కు వచ్చినా.. ప్రాక్టీస్ లేని అతన్ని నేరుగా జట్టులోకి తీసుకుంటారా? అనేది సందేహంగా మారింది. ఒకవేళ మయాంక్, రోహిత్ ఆడని పరిస్థితి ఉంటే మాత్రం తెలుగు తేజం కేఎస్ భరత్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. ఓపెనర్ శుభ్మన్ గిల్తో కలిసి అతను ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది.
పుజారాకే చాన్స్..
ఫస్ట్ డౌన్లో టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా ఆడే అవకాశం ఉంది. గత కొంతకాలంగా పేలవ ఫామ్ కనబరుస్తున్న పుజారా.. తన చెత్తాటతో శ్రీలంకతో టెస్ట్ సిరీస్కు ఎంపికవ్వలేదు. దాంతో ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన పుజారా డబుల్ సెంచరీలతో తన సత్తా ఏంటో చూపించాడు. ప్రస్తుతం సూపర్ టచ్లో కనిపిస్తున్నాడు. మరోవైపు మరో తెలుగు తేజం హనుమ విహారి సైతం ఐపీఎల్ సమయంలో కౌంటీ క్రికెట్ ఆడాడు. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఒకరిని తీసుకోవడం టీమ్మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది. కానీ పుజారాకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయనుండగా.. ఐదో స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడనున్నాడు.
కెప్టెన్గా బుమ్రా..
ఆరో స్థానంలో వికెట్ కీపర్ రిషభ్ పంత్ బ్యాటింగ్ చేయనుండగా.. ఏడో స్థానంలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆడనున్నాడు. గాయం కారణంగా ఐపీఎల్ మధ్యలోనే వైదొలిగిన అతని ప్రస్తుతం పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించాడు. ఇక ఎక్స్ట్రా స్పిన్నర్తో బరిలోకి దిగాలా? లేక ఎక్స్ట్రా పేసరా? అనేది కూడా టీమిండియా మేనేజ్మెంట్ తేల్చుకోలేకపోతుంది. ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలంటే అశ్విన్ తుది జట్టులో ఉంటాడు. లేదంటే సిరాజ్, ఉమేశ్ యాదవ్ల్లో ఒకరు ఆడుతారు. రోహిత్ గైర్హాజరీలో వైస్ కెప్టెన్ అయిన జస్ప్రీత్ బుమ్రా జట్టును నడిపించనున్నాడు. అతనికి తోడుగా శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు.
భారత తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ/కేఎస్ భరత్, శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్,రిషభ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్/సిరాజ్/ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా