స్పెషలిస్టు స్పిన్నర్ ఉండాలంటా
287 పరుగుల లక్ష్య ఛేదనలో నాలుగో రోజు ఆట ముగిసే సరికి కోహ్లీసేన 112/5 కష్టాల్లో పడింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో షమి కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు 6-56 నమోదు చేశాడు. ‘స్పిన్నర్లు, ఫేసర్లు ఎందరుండాలనే లెక్క జట్టు యాజమాన్యం చూసుకుంటుంది. మేం చేసేదేం లేదు. ప్రస్తుతం చక్కగా బౌలింగ్ చేసే స్పిన్నర్ ఉన్నాడు. నన్నడిగితే మాత్రం స్పెషలిస్టు స్పిన్నర్ ఉండాలంటాను. కానీ ఇవన్నీ జట్టు యాజమాన్యంపై ఆధారపడి ఉంటాయి.
సరైన ప్రాంతాల్లో విసిరేందుకే ప్రయత్నిస్తా
చాలాకాలం తర్వాత ఒకేసారి నలుగురు పేసర్లతో ఆడుతున్నాం. సరైన ప్రాంతాల్లో బంతులు విసరగల్గుతున్నాం. నాలుగేళ్ల క్రితం మాకింత అనుభవం లేదు. అప్పటితో పోలిస్తే మా బౌలింగ్లో నాణ్యతను మీరు గమనించొచ్చు. రెండు ఎండ్స్ నుంచి నిక్కచ్చిగా బంతులు విసిరితే ప్రత్యర్థిపై ఒత్తిడి పెరుగుతుంది. నేనెప్పుడు సరైన ప్రాంతాల్లో బంతులు విసిరేందుకు ప్రయత్నిస్తా. వికెట్లు పడుతుంటే ఆట గమనం మారిపోతుంది.
మూడో రోజు నుంచి ఊహించని విధంగా బౌన్స్
గెలుపోటములు ఆటలో భాగం. ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. తొలి రెండు రోజులు పిచ్ చాలా బాగుంది. మూడో రోజు నుంచి ఊహించని విధంగా బౌన్స్ అయింది. కోహ్లీ, పైన్ మాటల యుద్ధంపై అతిగా చెప్పను. అంత తీవ్రతేమీ లేదు. ఆటలో ఇవన్నీ ఓ భాగం మాత్రమే. టెస్టు క్రికెట్ సుదీర్ఘంగా ఆడాల్సి ఉంటుంది. అందుకే కాస్త దూకుడు అవసరం అవుతుంది. మాటల్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు' అని షమి పేర్కొన్నాడు.
సమంగా నిలిచిన ఇరు జట్లు
శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్లో 326 పరుగులకి ఆలౌటవగా.. భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 283 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో.. 43 పరుగుల ఆధిక్యాన్ని అందుకున్న ఆస్ట్రేలియా జట్టు.. రెండో ఇన్నింగ్స్లో 243 పరుగులకి ఆలౌటై.. భారత్కి 287 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా గడ్డపై భారత్ జట్టు ఇంత పెద్ద లక్ష్యాన్ని ఇప్పటి వరకూ ఛేదించలేదు. అడిలైడ్ వేదికగా గత వారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్లో భారత్ జట్టు 31 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.