ఆధిక్యతలో బ్లాక్ క్యాప్స్
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్పై న్యూజిలాండ్ పట్టు బిగించిన విషయం తెలిసిందే. బలమైన భారత జట్టును 217 పరుగులకే కట్టడి చేశారు న్యూజిలాండ్ బౌలర్లు. కైలె జెమిసన్ విజృంభించాడు. గాలిలో తేమను సద్వినియోగం చేసుకున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో అయిదు వికెట్లను పడగొట్టిన తొలి బౌలర్గా చరిత్ర సృష్టించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ కొనసాగినన్ని రోజులూ అతని పేరు మారుమోగిపోతూనే ఉంటుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్ వంటి టాప్ క్లాస్ బ్యాట్స్మెన్లతో పాటు లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు ఇషాంత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాలను పెవిలియన్ దారి పట్టించాడు.
బ్యాటింగ్ వైఫల్యంతో..
తొలి ఇన్నింగ్లో టీమిండియా బ్యాటింగ్లో విఫలం కావడం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. న్యూజిలాండ్ క్రమంగా పట్టుబిగిస్తోండటం మరింత కలవరపరుస్తోంది. ఈ పరిస్థితుల్లో వర్షం వస్తేనే బెటర్ అనే అభిప్రాయాన్ని కలగజేస్తోంది. వర్షం కురిసి మ్యాచ్ రద్దయితే.. రెండు జట్లనూ జాయింట్గా విజేతగా ప్రకటిస్తుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). నాలుగోరోజు ఆట గనక రద్దయితే.. దాదాపు అలాంటి పరిస్థితే ఉత్పన్నం కావడానికి అవకాశాలు ఉన్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్లో నాలుగోరోజు ఆట అత్యంత కీలకంగా మారినట్టయింది.
రాత్రంతా వర్షం..
అభిమానుల మొరను వరుణుడు ఆలకించినట్టే కనిపిస్తోంది. బ్రిటన్ కాలమానం ప్రకారం.. ఆదివారం రాత్రంతా భారీ వర్షం కురిసే వకాశం ఉందని ఆ దేశ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. సోమవారం ఉదయం 7 గంటల వరకు కూడా 60 శాతం వర్షం పడుతుందని అంచనా వేశారు. ఎల్లో వార్నింగ్ను జారీ చేశారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు 12 డిగ్రీలు, 11 గంటల నుంచి ఒంటిగంట వరకు 13 డిగ్రీలు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 14 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతుందని, వర్షం కురుస్తుందని వాతావరణ శాఖాధికారులు స్పష్టం చేశారు.