ఒక్క సిక్స్ లేదు..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 19.5 ఓవర్లలో 101 పరుగులు చేసి విజయాన్నందుకుంది. సూర్యకుమార్ యాదవ్(31 బంతుల్లో ఫోర్తో 26 నాటౌట్), హార్దిక్ పాండ్యా(20 బంతుల్లో ఫోర్తో 15 నాటౌట్) కడవరకు నిలిచి భారత్ థ్రిల్లింగ్ విక్టరీ అందించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మైకేల్ బ్రేస్వెల్, ఇష్ సోదీ తలో వికెట్ తీసారు. ఈ మ్యాచ్లో ఇరు జట్లు ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాయి. ధనాధన్ ఇన్నింగ్స్లను ఊహించిన ఫ్యాన్స్కు మాత్రం నిరాశే ఎదురైంది. బ్యాటింగ్ మెరుపులు లేకపోయినా.. ఈ మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజాను అందించింది. ఆఖరి బంతి వరకు మనివేళ్లపై నిలబెట్టింది.
ఓపెనర్లు విఫలం..
100 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ శుభ్మన్ గిల్(11) మరోసారి విఫలమయ్యాడు. బ్రేస్వెల్ వేసిన ఇన్నింగ్స్ 4వ ఓవర్లో క్యాచ్ ఔటయ్యాడు. వన్డే ఫార్మాట్లో సూపర్ ఫామ్ కనబర్చిన గిల్.. టీ20ల్లో మాత్రం తన తడబాటును కొనసాగిస్తున్నాడు. క్రీజులోకి వచ్చిన రాహుల్ త్రిపాఠితో మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆచితూచి ఆడటంతో పవర్ ప్లేలో టీమిండియా వికెట్ నష్టానికి 29 పరుగులు మాత్రమే చేసింది.
సుందర్ రనౌట్..
పవర్ ప్లే అనంతరం క్రీజులో సెట్ అయిన ఇషాన్ కిషన్(19).. గ్లేన్ ఫిలిప్స్ సూపర్ ఫీల్డింగ్కు రనౌటయ్యాడు. క్రీజులోకి సూర్యకుమార్ యాదవ్ రాగా.. భారీ షాట్కు ప్రయత్నించి రాహుల్ త్రిపాఠి(13) క్యాచ్ ఔటయ్యాడు. దాంతో టీమిండియా మేనేజ్మెంట్ వ్యూహాత్మకంగా వాషింగ్టన్ సుందర్ను ముందుకు పంపించింది. గత మ్యాచ్లో ఇదే టర్నింగ్ వికెట్పై హాఫ్ సెంచరీ చేయడంతో అతనికి ప్రమోషన్ ఇచ్చారు. అయితే గ్లేన్ ఫిలిప్స్ వేసిన 15వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ కారణంగా వాషింగ్టన్ సుందర్(10) రనౌటయ్యాడు. సుందర్ చెప్పేది వినకుండా సూర్య లేని పరుగుకు ప్రయత్నించగా.. సుందర్ తన వికెట్ను త్యాగం చేశాడు.
మొత్తం సింగిల్సే..
క్రీజులోకి హార్దిక్ పాండ్యా రాగా.. సూర్య ఆచితూచి ఆడారు. స్పిన్నర్ల కోటా పూర్తయిన తర్వాత చెలరేగుదామనుకున్న ఈ జోడీకి సాంట్నర్ ఊహించని షాకిచ్చాడు. పార్ట్ టైమ్ స్పిన్నర్ మార్క్ చాప్మన్ను రంగంలోకి దింపాడు. దాంతో షాకైన హార్దిక్, సూర్య.. క్విక్ సింగిల్స్కు పరిమితమయ్యారు. 18 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన సమయంలో సాంట్నర్ 5 పరుగులివ్వడమే ఇవ్వడంతో భారత్ విజయానికి చివరి 12 బంతుల్లో 13 పరుగులు అవసరమయ్యాయి.
కొంపముంచిన టిక్నర్
ఫెర్గూసన్ వేసిన 19వ ఓవర్లో తొలి నాలుగు బంతుల్లో 2 పరుగులే రావడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కానీ ఐదో బంతికి బౌండరీ బాదిన హార్దిక్ పాండ్యా.. చివరి బంతికి సింగిల్ తీసాడు. దాంతో చివరి 6 బంతులకు 6 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్ను టిక్నర్ వేయగా.. తొలి మూడు బంతుల్లో రెండు పరుగులే వచ్చాయి. ఈ పరిస్థితుల్లో సూర్య ఇచ్చిన రిటర్న్ క్యాచ్తో పాటు హార్దిక్ పాండ్యా రనౌటయ్యే అవకాశాలను టిక్నర్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో సూర్య బౌండరీ బాది మరో బంతి మిగిలుండగానే విజయాన్నందించాడు. టిక్నర్ ఆ క్యాచ్ పట్టినా.. రనౌట్ చేసినా భారత్ ఓటమిపాలయ్యేది.