246 పరుగులకే కట్టడి..
దీనితో మూడో వన్డే ఉత్కంఠభరితంగా మారింది. ఆదివారం మధ్యాహ్నం 3:30 గంటలకు మాంచెస్టర్ వేదికగా మూడో వన్డేలో తలపడతాయి ఈ రెండు జట్లు. లార్డ్స్లో రెండో వన్డేలో టాస్ ఓడి- తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 49 ఓవర్లల్లో 246 పరుగులకు ఆలౌట్ అయింది. మన బౌలర్ల దెబ్బకు ఏ ఒక్క బ్యాటర్ కూడా స్థిరంగా క్రీజ్లో నిల్చోలేకపోయారు. భారీ షాట్లు ఆడలేకపోయారు. చివర్లో మొయిన్ అలీ-47, డేవిడ్ విల్లే-41 పరుగులతో ఆదుకోవడంతో ఆ మాత్రం స్కోరయినా సాధించగలిగింది ఇంగ్లాండ్.
బౌలర్లు ఫర్వాలేదనిపించుకున్నా..
ఆల్రౌండర్ రవీంద్ర జడేజా మినహా మిగిలిన బౌలర్లందరూ వికెట్లు తీశారు. యజువేంద్ర చాహల్ తన ఫామ్ను కంటిన్యూ చేశాడు. నాలుగు వికెట్లు పడగొట్టాడు. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా రెండు, మహ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ ఒకటి చొప్పున వికెట్లు తీసుకున్నారు. బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. అయిదో వికెట్ భాగస్వామ్యం వరకు వికెట్లు పడుతూనే వచ్చాయి. లివింగ్స్టొన్ అవుట్ అయ్యాక మొయిన్ అలీ-డేవిడ్ విల్లే ద్వయం వికెట్ల పతనాన్ని కొంతవరకు అడ్డుకుంది గానీ- వీరిద్దరూ అవుట్ అయిన తరువాత మళ్లీ అదే స్థితి.
కొంపముంచిన డకౌట్లు..
247 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఏ దశలోనూ పోరాడలేదు. 12వ ఓవర్లోనే టీమిండియా ఓటమి ఖాయమైపోయింది. 12వ ఓవర్ రెండో బంతికి విరాట్ కోహ్లీ వెనుదిరగడంతో మ్యాచ్పై ఆశలు సన్నగిల్లాయి. మూడో ఓవర్లో కేప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు. 11వ ఓవర్లో రిషభ్ పంత్ కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. తొలి 10 ఓవర్లల్లో టీమిండియా చేసింది 29 పరుగులే అంటే ఎంత జాగ్రత్తగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. అయినా గానీ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది.
విరాట్ కోహ్లీ.. మళ్లీ
విరాట్ కోహ్లీ బ్యాడ్ టైమ్ మొదలైనట్టే. గాయం కారణంగా తొలి వన్డేను మిస్ అయిన అతను ఈ మ్యాచ్లో విఫలం అయ్యాడు. 16 పరుగులకే వెనుదిరిగాడు. అవుట్సైడ్ ఆఫ్ బలహీనత కోహ్లీని వెంటాడింది. మిడిల్ అండ్ ఆఫ్ స్టంప్ మీద పిచ్ అయి గాల్లోకి లేచిన బంతిని ఆడటంలో తటపటాయించాడు. 130 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఆ బంతి అతని బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతుల్లో వాలింది.
భారీ భాగస్వామ్యం..
కాస్త గట్టిగా పోరాడితే గెలిచే దగ్గ స్కోర్ ఇంగ్లాండ్ది. ఆ పోరాట స్ఫూర్తి లోపించిందిక్కడ. టీ20 సిరీస్ను సొంతం చేసుకోవడం, తొలి వన్డేలో ఘన విజయాన్ని అందుకోవడం వల్ల అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. అతి ఆత్మవిశ్వాసంతో ఆడినట్టు కనిపించారు టీమిండియా ప్లేయర్లు. జట్టు స్కోర్ 29 పరుగుల వద్ద మూడో వికెట్ పడిన తరువాత ఎదురైన ప్రమాదాన్ని పసిగట్టలేకపోయాడు విరాట్ కోహ్లీ. తన బలహీనతను మరోసారి చాటుకున్నాడు.
మిడిలార్డర్ ఢమాల్..
బ్యాటింగ్ ఆర్డర్కు వెన్నెముకగా పేరు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్.. తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. 27 పరుగులే చేయగలిగాడు. ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా మరోసారి ఉమ్మడిగా ఫెయిల్ అయ్యారు. చెరో 29 పరుగులు చేశారు. వారందరి కంటే ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ కాస్తో, కూస్తో జట్టును ఆదుకున్నాడు. ప్రొఫెషనల్ బ్యాటర్ కానప్పటికీ అతను ఇంగ్లాండ్ బౌలర్లను ప్రతిఘటించాడు. 28 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్తో 23 పరుగులు చేశాడు.