
హైదరాబాద్: ప్రస్తుతం లార్డ్స్ తరహా పిచ్లపై ఏ జట్టునైనా ఆలౌట్ చేస్తామని, అది ఒక్క టీమిండియాకే పరిమితం కాదని ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ పేర్కొన్నాడు. ఆతిథ్య ఇంగ్లాండ్తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో
ఆండర్సన్ చెలరేగడంతో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్లో 107 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
తొలి రోజులాగే రెండో రోజు కూడా మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో రెండు సెషన్లలో కేవలం 8.3 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. వర్షం దోబూచులాడిన రెండో రోజు ఆఖరి ఇన్నింగ్స్ మాత్రమే పూర్తిగా సాగగా ఇంగ్లండ్ పేసర్లు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ బంతులతో చెలరేగారు.
ముఖ్యంగా జేమ్స్ ఆండర్సన్ (5/20) ధాటికి భారత్ వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో 35.2 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. రవిచంద్రన్ అశ్విన్ (29) మాత్రమే టాప్ స్కోరర్గా నిలిచాడు. మరో బౌలర్ క్రిస్ వోక్స్కు రెండు వికెట్లు దక్కాయి.
ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఐదు వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. రెండో రోజు మ్యాచ్ అనంతరం ఆండర్సన్ మాట్లాడుతూ "పిచ్ బౌలింగ్కు అనుకూలంగా పరిస్థితుల్లో మేము మంచి బౌలింగ్ వేశాం. దాంతోనే టీమిండియానే స్వల్ప స్కోరుకే పరిమితం చేశాం" అని అన్నాడు.
"పిచ్ అనేది సీమ్కు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రపంచంలోని మేటి జట్లను సైతం మేము ఆలౌట్ చేసిన సందర్బాల్లో చాలానే ఉన్నాయి. ఇంగ్లాండ్లో కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ తరహా వాతావరణ పరిస్థితి అనేది ఎదురవుతుంది. గాలిలో తేమ అనేది మా బౌలింగ్కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఇక్కడ మేము బాగా కష్టపడిపోయామని చెప్పలేను" అని ఆండర్సన్ తెలిపాడు.
"మంచి బంతులు వేయడంపైనే దృష్టి సారించాం. అదే సమయంలో వైవిధ్యాన్ని జోడించాం. దాంతో టీమిండియాను తొందరగా ఆలౌట్ చేయడం సాధ్యపడింది. ఒకవేళ సీమ్కు అనుకూలంగా ఉన్న లార్డ్స్ పిచ్లో నేను వికెట్లు తీయకపోతే చాలా నిరాశ చెందేవాడిని. నా ప్రదర్శన సంతృప్తినిచ్చింది" అని అండర్సన్ స్పష్టం చేశాడు.