హైదరాబాద్: టీమిండియా ప్రధాని కోచ్ పదవికి రెండు లైన్ల దరఖాస్తుని పంపి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ బీసీసీఐకి షాకిచ్చిన సంగతి తెలిసిందే. సెహ్వాగ్ పంపిన రెండు లైన్ల రెజ్యూమ్ని చూసి బీసీసీఐ సైతం బిత్తరపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఒక హై ప్రొఫైల్ జాబ్కు దరఖాస్తు చేసేటప్పుడు ఇలానా వ్యవహరించడం అంటూ సెహ్వాగ్ తీరుని కొంతమంది బహిరంగంగానే విమర్శించారు. అయితే తనపై వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని సెహ్వాగ్ ఖండించడంతో ఆ వివాదం అప్పట్లో సద్దుమణింగింది.
నిజానికి రెండు లైన్ల రెజ్యూమ్ అనేది పేరుకే సరిపోతుందని, అలాంటప్పుడు ఆ తరహా రెజ్యూమ్ను ఎందుకు పంపుతానంటూ సెహ్వాగ్ ఎదురు ప్రశ్నించాడు. కాగా ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేయడంతో ఆ పదవి ఎవరిని వరించనుందా? అని క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే ప్రధాన కోచ్ పదవికి పలువురు దరఖాస్తులు చేసుకున్నా సెహ్వాగ్, రవిశాస్త్రిల మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. బీసీసీఐ ట్రెజరర్ అనిరుధ్ చౌదరి నుంచి సెహ్వాగ్కు మద్దతు లభిస్తుండగా, రవిశాస్త్రికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి మద్దతు ఉంది.
సెహ్వాగ్ను ప్రధాన కోచ్గా ఎంపిక చేస్తే మాత్రం అతను నోరు అదుపులోకి పెట్టుకోకతప్పదని అనిరుధ్ చౌదరి పేర్కొన్నారు. 'అవును.. వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు. ఒకవేళ అతను కోచ్గా ఎంపికైతే మాత్రం కొన్ని షరతులు ఉంటాయి. ముఖ్యంగా నోరు అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది' అని అన్నాడు.
అంతేకాదు ఏది పడితే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి సెహ్వాగ్ దూరంగా ఉండాల్సి వస్తుంది. టీమిండియా మ్యాచ్ ఓడిపోయినా లేక సిరీస్ కోల్పోయినా మాట్లాడేప్పుడు ఆచితూచి మాట్లాడాలి. అలా కాకుండా నేను ఇలానే ఉంటా అంటే కష్టాలు తప్పవని, ఆ విషయంలోనే సెహ్వాగ్ గురించి ఆందోళగా ఉందని అనిరుధ్ చౌదరి అభిప్రాయపడ్డాడు.
ఇప్పటికే టీమిండియా ప్రధాన కోచ్ పదవికి వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ, లాల్చంద్ రాజ్పుత్, దొడ్డ గణేష్లు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. జూలై 9న నూతన కోచ్ను ప్రకటిస్తామని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ శుక్రవారం తిరుమలలో అన్నారు.