దుబాయ్: ఐసీసీ తాజాగా విడుదుల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కో స్థానం కిందికి దిగజారారు. టీ20 ప్రపంచకప్ 2022 ముగిసిన తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో వీరు న్యూజిలాండ్ పర్యటనకు దూరంగా ఉన్నారు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఈ ఏడాది రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఎక్కువగా వన్డే మ్యాచ్లు ఆడలేదు. దాంతో వీరిద్దరి వన్డే ర్యాంకింగ్స్ దిగజరాయి.
విరాట్ కోహ్లీ 707 రేటింగ్ పాయింట్లతో 8వ స్థానంలో నిలవగా.. రోహిత్ శర్మ 704 రేటింగ్ పాయింట్లతో 9వ స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన టీమిండియా యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ మెరుగైన ర్యాంకులు అందుకున్నారు. 129 పరుగులు సాధించిన శ్రేయస్ అయ్యర్.. 6 స్థానాలు దాటుకొని 27వ ర్యాంక్లోకి దూసుకొచ్చాడు. 108 పరుగులు చేసి 3 స్థానాలు ఎగబాకిన శుభ్మన్ గిల్ 34వ ర్యాంక్లో నిలిచాడు.
చివరి వన్డే వర్షం కారణంగా రద్దవ్వడంతో 0-1తో ఈ సిరీస్ను న్యూజిలాండ్ జట్టు సొంతం చేసుకొన్న విషయం తెలిసిందే. అయితే, కివీస్తో మ్యాచ్లో అర్ధశతకం సాధించినప్పటికీ కెప్టెన్ శిఖర్ ధావన్ రెండు స్థానాలు కిందకు పడిపోయాడు. న్యూజిలాండ్ బ్యాటర్లు టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్ సైతం ఒక స్థానం ఎగబాకారు. తొలి వన్డేలో ఆ జట్టు 300 పరుగుల లక్ష్యాన్ని అధిగమించడంలో లాథమ్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కేన్ సైతం టాప్ 10 స్థానంలో చేరాడు. భారత్ ఈ ఏడాది మరో వన్డే సిరీస్ ను ఆడనుంది. డిసెంబర్ 4 నుంచి బంగ్లాదేశ్ తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడనుంది.
ఈ సిరీస్తో కోహ్లీ, రోహిత్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. టీమిండియా ప్రధాన జట్టు ఈ సిరీస్ ఆడనుంది. మరో రెండు రోజుల్లో టీమిండియా బంగ్లాదేశ్లో అడుగుపెట్టనుంది. మూడు వన్డేలతో పాటు మూడు టెస్ట్ల సిరీస్ ఆడనుంది.