ధోనీ అవకాశం ఇవ్వలేదు:
తాజాగా స్పోర్ట్స్ తక్ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ... '2008లో ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో భారత్ వరుసగా మూడు వన్డేలు గెలిచి సిరీస్ను సాధించింది. నాల్గో వన్డే వర్షార్పణం అయ్యింది. ఐదో వన్డేలో అవకాశం ఇస్తారని ఎదురుచూసినా అది జరగలేదు. అయితే ఆ వన్డేకు తుది జట్టును ఎంపిక చేసే క్రమంలో కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. ఇర్ఫాన్ బౌలింగ్ సరిగా లేకపోవడం వల్లే అవకాశం ఇవ్వలేదని చెప్పిన విషయం కోపం తెప్పించింది' అని తెలిపాడు.
ప్రణాళికలో భాగంగానే:
'అంతకుముందు అప్పటి కోచ్ గ్యారీ కిర్స్టన్తో మాట్లాడా. తనను నిరూపించుకోవడానికి అవకాశం ఇవ్వలని అడిగినా ఫలితం లేకుండా పోయింది. నీ బౌలింగ్, బ్యాటింగ్ బాగుంటాయి.. కానీ అవకాశం ఇచ్చే అంశం నా చేతుల్లో లేదు అని కిర్స్టన్ అన్నాడు. కిర్స్టన్ చెప్పిన దానికి భిన్నంగా ధోనీ చెప్పడంతో ఈ విషయంపై అమీతుమీకి సిద్ధమయ్యా. నేరుగా మహీ వద్దకు వెళ్లి.. "మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. నా ప్రదర్శన బాగాలేని కారణంగా జట్టులో అవకాశం ఇవ్వలేదని చెప్పడం మీడియాలో రాద్దాంతం అవుతుంది" అని అడిగేశా. ప్రణాళికలో భాగంగానే నిన్ను తుది జట్టుకు దూరం పెట్టామని అతడు బదులిచ్చాడన్నాడు' అని ఇర్ఫాన్ చెప్పాడు.
అపోహలు కరెక్ట్ కాదు:
భారత క్రికెట్ జట్టులో ఒక్కొక్కరికీ ఒక్కో రూల్ అనేది ఎప్పట్నుంచో వస్తున్న ఆచారమని ఇర్ఫాన్ అన్నాడు. జట్టు పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేసినా అవకాశం ఇవ్వకపోతే తాను ఏమి చేయగలనని ఇర్ఫాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. కొన్ని సందర్భాల్లో స్వింగ్ బౌలింగ్ చేయమని, మరికొన్ని సందర్భాల్లో కట్టర్స్పైనే దృష్టి పెట్టమని పదే పదే కెప్టెన్లు చెబుతూ ఉండటంతో తాను బౌలింగ్ను మార్చుకోవాల్సి వస్తూ ఉండేదన్నాడు. అంతేకానీ స్వింగ్ బౌలర్నైనా తాను స్వింగ్ బౌలింగ్ వేయలేకపోవడంతోనే జట్టుకు దూరమైన అపోహలు కరెక్ట్ కాదన్నాడు.
ఒక్కొక్కరికీ ఒక్కో రూల్:
'నాకు జట్టులో ఉద్వాసన పలికిన ఒకానొక సందర్భంలో రెండు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నా. ఒకటి వన్డేల్లో కాగా, రెండోది టీ20 మ్యాచ్. భారత్ క్రికెట్లో ఒక్కొక్కరికీ ఒక్కో రూల్. వృద్ధిమాన్ సాహా ఏడాది పాటు క్రికెట్ ఆడకుండానే రీఎంట్రీ ఇచ్చాడు. అప్పటికి రిషభ్ పంత్ రెండు సెంచరీలు చేసి ఉన్నాడు. అయినా సాహాకు అవకాశం ఇచ్చారు. కొంతమందికి సపోర్ట్ ఉంటే, మరికొంతమందికి అది ఉండదు. కొందరిది అదృష్టం.. మరి కొందరిది దురుదృష్టం. నేను దురదృష్టవంతుల్లో ఒకడిని' అని ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు.