
న్యూఢిల్లీ: కొద్ది రోజుల క్రితం వివాదాలతో ముగిసిన భారత మహిళల తాత్కాలిక కోచ్ రమేశ్ పవార్ పదవీకాలం అర్థాంతరంగానే ముగిసింది. ఈ క్రమంలో భారత మహిళల జట్టు కోచ్ పదవీ కోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ ప్రకటనకు స్పందించి ఇప్పటికే అంతర్జాతీయ జట్లకు కోచ్గా వ్యవహరించిన వారితో పాటు ఎవరూ ఊహించని విధంగా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హర్షల్ గిబ్స్ సైతం ఈ పదవిపై ఆసక్తి చూపుతున్నాడు.
అంతర్జాతీయ జట్లకు కోచ్గా పనిచేసిన డావ్ వాట్మోర్, వెంకటేశ్ ప్రసాద్, టామ్ మూడీ వంటి అనుభవజ్ఞులతో పోటీ పడి తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. గిబ్స్ ఇటీవల కువైట్ జట్టుకు కోచ్గా కొత్త అవతారం ఎత్తాడు. ఆస్ట్రేలియాలో 2020లో జరగనున్న టీ20 ప్రపంచ కప్కు కువైట్ జట్టు అర్హత సాధించడానికి అతడే కారణం. ఈ మధ్యే ముగిసిన అఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో బాఖ్ లెజెండ్స్ జట్టుకు ప్రధాన కోచ్గా పనిచేశాడు.
దక్షిణాఫ్రికా తరఫున 90 టెస్టులు, 248 వన్టేలు, 23 టీ20 మ్యాచ్లు ఆడాడు. 'భారత మహిళల జట్టుకు కోచ్గా పనిచేయాలని గిబ్స్ ఎంతో ఆసక్తి చూపుతున్నాడు. టీమిండియా జాతీయ జట్టుతో కలిసి పనిచేయడం ఎంతో ప్రతిష్ఠాత్మక విషయం. కోచ్ పదవి కోసం గిబ్స్ దరఖాస్తు చేశాడు. ఇంటర్వ్యూ కోసం బీసీసీఐ ఆహ్వానిస్తుందని నమ్మకంగా ఉన్నాడు' అని హర్షల్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
కొద్ది కాలం క్రితం వరకూ టీమిండియా మహిళల తాత్కాలిక కోచ్గా పనిచేసిన రమేశ్ పవార్ ఇప్పటికే వివాదాలు రావడంతో అతనిని కొనసాగించడమనేది సందేహంగానే మిగిలింది. కానీ, ప్రస్తుత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానలు మాత్రం పవారే మాకు కెప్టెన్గా కొనసాగాలంటూ బీసీసీఐకు లేఖ ద్వారా తెలిపారు.