వాళ్లదే కీలక పాత్ర..
తనకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కడంపై సంతోషం వ్యక్తం చేసిన పాండ్యా.. 'నాకు ఓకే. కానీ కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు కూడా ఉన్నాయి. అవి చాలా గొప్పవి' అంటూ తన సహచర ఆటగాళ్లను మెచ్చుకున్నాడు. అలాగే తనకు ఈ అవార్డు దక్కడంలో సహాయక సిబ్బంది, జట్టు చాలా కీలక పాత్ర పోషించారని కొనియాడాడు. ఈ జట్టు తరఫునే తను ఈ ట్రోఫీ తీసుకుంటున్నానని, ఈ విషయంలో చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన సిరీస్ డిసైడర్లో పాండ్యా 30 పరుగులు చేయడంతోపాటు 4 కీలక వికెట్లు తీసుకున్న సంగతి తెలిసిందే.
టాప్ వికెట్ టేకర్..
కివీస్తో సిరీస్లో చివరి మ్యాచ్లో అదరగొట్టిన పాండ్యా అంతకుముందు బ్యాటుతో అంతగా రాణించలేదు. ఈ సిరీస్లో పాండ్యా మొత్తం 66 పరుగులు మాత్రమే చేశాడు. సిరీస్లో ఎక్కువ మ్యాచులు బౌలింగ్కు సహకరించే పిచ్లపై జరగడంతో ఏ ఆటగాడూ బ్యాటుతో అంతగా రాణించలేదు. అదే సమయంలో మూడు మ్యాచుల్లో కలిపి 5 వికెట్లు తీసుకున్న పాండ్యా.. సిరీస్లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్గా నిలిచాడు. మరో పేసర్ అర్షదీప్ సింగ్ కూడా ఐదు వికెట్లు తీసుకోవడం గమనార్హం. అయితే పాండ్యా ఎకానమీ కూడా మెరుగ్గానే ఉంది. దానికితోడు అడపాదడపా బ్యాటుతో కూడా ఫర్వాలేదనిపించాడు. దీంతో అతనికి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు దక్కింది.
కెప్టెన్సీ మంత్ర..
ఇప్పటి వరకు పాండ్యా సారధ్యంలో టీమిండియా 11 టీ20లు మ్యాచులు ఆడింది. వీటిలో ఎనిమిదింట గెలిచిన భారత జట్టు.. కేవలం రెండింట్లో మాత్రమే ఓడింది. ఈ రికార్డుపై కూడా పాండ్యా స్పందించాడు. తను కెప్టెన్సీ చేసే సమయంలో మరీ ఎక్కువగా ఆలోచించనని చెప్పాడు. పరిస్థితిని బట్టి చాలా సింపుల్గా నిర్ణయాలు తీసుకుంటానని, తర్వాత ఏం జరుగుతుందో అనే ఆలోచనతో ఎలాంటి డెసిషన్స్ తీసుకోబోనని చెప్పాడు. 'ఒకవేళ నేను కింద పడితే.. అది కూడా నా నిర్ణయమే' అదే తన కెప్టెన్సీ మంత్ర అని వెల్లడించాడు.