హైదరాబాద్: ఇంగ్లాండ్తో జరగనున్న మూడు వన్డేలు, టీ20ల సిరీస్లకు బీసీసీఐ బుధవారం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జట్టులో ట్రిపుల్ సెంచరీ వీరుడు కరుణ్ నాయర్కు చోటు దక్కకపోవడంపై వెటరన్ ఆఫ్ స్ఫిన్నర్ హర్భజన్ సింగ్ మండిపడ్డాడు.
ఇంగ్లాండ్ సిరిస్కు వన్డే, టీ20 జట్టుని ఎంపిక చేసిన సెలక్టర్లపై ట్విట్టర్ వేదికగా తన ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. ఇటీవల ఇంగ్లాండ్తో ముగిసిన టెస్టు సిరిస్లో చివరిదైన చెన్నై టెస్టులో కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ సెంచరీ చేసిన నాయర్కు చోటు దక్కక పోవడంపై భజ్జీ అసహనం వ్యక్తం చేశాడు.

'హల్లో గయ్స్ కరుణ్ నాయర్ ఎక్కడ?? ఇంగ్లాండ్పై 300 పరుగులు సాధించాడు. వన్డేలు వదిలేయండి. ఇంగ్లాండ్తో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్లకు కూడా ఎంపిక చేయలేదు' అంటూ సెలక్టర్ల నిర్ణయాన్ని ట్విట్టర్లో హార్భజన్ సింగ్ ప్రశ్నించాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ భజ్జీ తన ట్వీట్ని ట్విట్టర్ నుంచి డిలీట్ చేశాడు.
దాదాపు మూడు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ వన్డే, టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. 2013 డిసెంబర్లో చివరిసారిగా భారత జట్టు తరఫున యువరాజ్ సింగ్ వన్డే మ్యాచ్ ఆడాడు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు జట్టుకు దూరంగానే ఉన్నాడు.

భారత జట్టులోకి మళ్లీ వస్తానని, నీలం రంగు జెర్సీ ధరిస్తానని గతంలో యువరాజ్ సింగ్ ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అతడు అనుకున్నట్లే జట్టులోకి పునరాగమనం చేశాడు. రంజీల్లో పంజాబ్ కెప్టెన్గా యువరాజ్ సింగ్ 5 మ్యాచ్లు ఆడిన యువీ 84 సగటుతో 672 పరుగులు చేశాడు.
దేశవాళీ క్రికెట్లో యువరాజ్ సింగ్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని అతడిని జట్టులోకి తీసుకోవడం జరిగిందని చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ జట్టును ప్రకటించే సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. అంతే కాకుండా ఒక డబుల్ సెంచరీతో పాటు 180 కూడా స్కోర్ చేసి చక్కని ఫామ్ కనబర్చాడని ఆయన గుర్తు చేశారు.
అందుకే యూవీకి రెండు ఫార్మెట్లలో అవకాశం ఇచ్చామని తెలిపారు. తామంతా సాధ్యమైనంత వరకు అత్యుత్తమ జట్టుని ఎంపిక చేశారమని, ఇది మంచి ఫలితాన్ని ఇస్తుందని ఆశిస్తున్నామని ఎమ్మెస్కే ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉంటే వన్డే, టి20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తాను తప్పుకొంటున్నట్లు ధోనీ ప్రకటించిన తర్వాత ఎంపిక చేసిన తొలిజట్టు ఇదే కావడం విశేషం.

ఇంగ్లాండ్తో మూడు వన్డేలకు భారత జట్టు:
వన్డే జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), మహేంద్ర సింగ్ ధోని (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, యువరాజ్ సింగ్, అజింక్య రహానె, హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్.
ఇంగ్లాండ్తో మూడు టీ20లకు భారత జట్టు:
టీ20 జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), మహేంద్ర సింగ్ ధోని (వికెట్ కీపర్), మన్దీప్ సింగ్, కేఎల్ రాహుల్, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, రిషబ్పంత్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్, మనీశ్ పాండే, బుమ్రా, భువనేశ్వర్, ఆశిష్ నెహ్రా