ఆఖరి ఓవర్ మూడో బంతిని
ఆఖరి ఓవర్ మూడో బంతిని కార్తీక్ లాంగాన్ వైపు కొట్టినా సింగిల్ తీయలేదు. దీంతో దినేశ్ కార్తీక్ సింగిల్ తీయకపోవడం వల్లే భారత్ ఓడిందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో హర్భజన్ ఈ వివాదంపై స్పందించాడు. ఓ జాతీయ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్యూలో భజ్జీ మాట్లాడుతూ "దినేశ్ కార్తీక్ చేసిన చిన్న తప్పు వల్లే భారత్ పరాజయం చవి చూసింది. అతను సింగిల్ తీయకపోవడం భారత విజయవకాశాలను దెబ్బతీసింది. కార్తీక్కు తనపై తనకు విశ్వాసం ఉండటం మంచిదే. కానీ అదే నమ్మకాన్ని ఇతరులపై కూడా ఉంచాలి" అని అన్నాడు.
నిదాహాస్ ట్రోఫి ఫైనల్లో గెలిపించడంతో
"ముఖ్యంగా వారు బాగా ఆడుతున్నప్పుడు వారికి కూడా అవకాశం ఇవ్వాలి. గతేడాది నిదాహాస్ ట్రోఫి ఫైనల్లో గెలిపించడంతో కార్తీక్కు ఫినిషర్ ట్యాగ్ వచ్చింది. కానీ అక్కడ బౌలింగ్ చేసింది సౌమ్య సర్కార్ కానీ, టీమ్ సౌధీ కాదనే విషయాన్ని గ్రహించాలి. కృనాల్ అంతకు ముందు సౌతీ ఓవర్లో 18 పరుగుల రాబట్టాడు. ఆ సింగిల్ తీసి కృనాల్కు అవకాశం వస్తే పరిస్థితి మరోలా ఉండేది. ఏది ఏమైనా కార్తీక్ చేసిన తప్పు భారత గెలుపు అవకాశాలను దెబ్బతీసింది" అని భజ్జీ అభిప్రాయపడ్డాడు.
6 బంతుల్లో 16 పరుగులు
మూడో టీ20లో టీమిండియా విజయ సమీకరణం 6 బంతుల్లో 16 పరుగులుగా మారింది. భారత్ జోడి ఊపును చూసి 16 పరుగుల్ని సాధించడం ఏమంత కష్టం కాదనిపించింది. దీంతో టీమిండియాదే విజయం అని అంతా భావించారు. అయితే, క్రీజులో ఉన్న దినేశ్ కార్తీక్ అతి విశ్వాసం మ్యాచ్నే చేజారేలా చేసింది. అదేలాగంటే ఆఖరి ఓవర్ వేసేందుకు సౌతీ బంతిని అందుకున్నాడు. తొలి బంతికి కార్తీక్ రెండు పరుగులు తీశాడు. ఇక కావాల్సింది 5 బంతుల్లో 14 పరుగులు. రెండు బంతికి పరుగులేమీ తీయలేదు. బంతి బాగా ఆఫ్ స్టంప్కు వేయడంతో దినేశ్ కార్తీక్ హిట్ చేసేందుకు తటపటాయించాడు.
వైడ్ అవుతుందనే ధీమాతో
అది వైడ్ అవుతుందనే ధీమాతో దినేశ్ కార్తీక్ ఆ బంతిని లైట్ తీసుకున్నాడు. కానీ అంపైర్ వైడ్ ఇవ్వలేదు. దీనిపై ఫీల్డ్ అంపైర్ను కార్తీక్ అడిగినా నిరాశే ఎదురైంది. 4 బంతుల్లో 14 పరుగులు కావాలి. మూడో బంతిని కార్తీక్ లాంగాన్ వైపు కొట్టినా సింగిల్ తీయలేదు. కృనాల్ సింగిల్ కోసం అవతలి వైపు చేరుకున్నా.. అతి ఆలోచనతో కార్తీక్ పరుగు తీయలేదు. దాంతో భారత్కు మూడు బంతుల్లో 14 పరుగులు అవసరమయ్యాయి. కానీ, నాలుగో బంతి బౌన్సర్ కావడంతో దీనిని ఊహించని కార్తీక్ సింగిల్ తీశాడు. ఇక, ఐదో బంతిని కృనాల్ సింగిలే తీశాడు. ఇక ఆరో బంతి వైడ్ కావడంతో భారత్ ఖాతాలో పరుగు చేరగా, కివీస్ మరో బంతి వేయాల్సి వచ్చింది. అయితే ఆఖరి బంతిని కార్తీక్ సిక్స్ కొట్టడంతో భారత్ 208 పరుగులు చేసింది.
మూడో బంతికి సింగిల్ తీయకపోవడం వల్లే!
ఆఖరి ఓవర్లో మూడో బంతికి అలవోకగా సింగిల్ వచ్చే అవకాశమున్నా తీసుకోవడానికి దినేశ్ కార్తీక్ నిరాకరించి అందరికీ షాకిచ్చాడు. కృనాల్ సింగిల్ కోసం పరుగెత్తాడు. దాదాపు కార్తీక్ దాకా వెళ్లాడు. కానీ అతడు వద్దనడంతో తిరిగి వెనక్కి వెళ్లిపోయాడు. మూడో బంతికి కృనాల్ సింగిల్కు ప్రయత్నించినప్పుడు కార్తీక్ తిరస్కరించడాన్ని భారత అభిమానులు సైతం తప్పుబట్టారు. ఆ సింగిల్ తీసుంటే పరిస్థితి మరోలా ఉండేదని, అది భారత గెలుపుకు దారితీసేదని అభిప్రాయపడుతున్నారు. ‘కార్తీక్.. నువ్వు ధోని అనుకుంటున్నావా?' అని ఒకరు.. ‘ఎప్పుడూ స్వప్రయోజనం కోసమే కార్తీక్ ఆడుతాడు.. ఇదే ధోనికి కార్తీక్ ఉన్న తేడా' అని మరొకరు ఘాటుగా కామెంట్ చేశారు.