
హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్లో ఢిల్లీ డేర్డెవిల్స్ కెప్టెన్గా పగ్గాలు అందుకున్న గౌతమ్ గంభీర్.. ఆ జట్టు వరుస ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ బుధవారం కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు పరాజయాలకు బాధ్యతకు వహిస్తూ ఈ సీజన్ కోసం తనకు రావాల్సిన జీతం మొత్తాన్ని (రూ.2.8 కోట్లు) వదులుకోవాలని నిర్ణయించుకున్నాడు.
జట్టు చెత్త ప్రదర్శన కారణంగా ఒక కెప్టెన్ ఈ విధంగా జీతం తీసుకోకుండా ఆడడం ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి. అయితే 'ఫ్రాంఛైజీ నుంచి ఈ సీజన్ కోసం ఎలాంటి జీతం తీసుకోరాదని గౌతమ్ నిర్ణయించుకున్నాడు. అతడికి ఢిల్లీ తరఫున ఉచితంగానే ఆడతాడు' ఢిల్లీ యాజమాన్యానికి చెందిన ఓ వ్యక్తి చెప్పాడు.
అయితే, గంభీర్ తీసుకున్న నిర్ణయం పట్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను గంభీర్తో పంచుకుంటున్నారు. 'గౌతమ్ గంభీర్ కెప్టెన్గా ఉన్నాడు గనుకే ఢిల్లీ డేర్డెవిల్స్కి మద్దతు తెలిపాను. కానీ ఇప్పుడు అతడు కెప్టెన్గా వైదొలగాడు. నేను కూడా డీడీ టీమ్కు మద్దతు ఉపసంహరించుకుంటున్నాను' అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.
ఓ నెటిజన్ 'గౌతమ్ గంభీర్ సెల్యూట్. కానీ నీ నిర్ణయం మమ్మల్ని బాధ పెడుతోంది. అయినప్పటికీ నువ్వే బాస్' అంటూ ట్వీట్ చేశాడు. 'నేను గంభీర్ వీరాభిమానిని కాదు. కానీ గంభీర్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులు బాధాకరం. అసలు దీని వెనుక ఉన్న మతలబు ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నేను గంభీర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా' అంటూ మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు.
2011 నుంచి ఏడు సీజన్ల పాటు కోల్కతా నైట్రైడర్స్కు కెప్టెన్గా వ్యవహరించిన గంభీర్ 2012, 2014లో కోల్కతాను ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే, ఈ సీజన్లో సొంత జట్టుకు తిరిగొచ్చిన గంభీర్, ఢిల్లీ జట్టుకు ఆ స్థాయిలో విజయాలు అందించలేకపోయాడు. దీంతో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం గంభీర్ స్థానంలో యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ఎంపికయ్యాడు.