|
ధోనీ సిక్సర్ ఒక్కటే కాదు..
ఇక ఈ ప్రపంచకప్ గెలిచి నేటి 9 ఏళ్లు కావడంతో ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ క్రిక్ఇన్ఫో.. ధోనీ నాటి విన్నింగ్ షాట్ను గుర్తు చేస్తూ ట్వీట్ చేసింది. నాటి ధోనీ విన్నింగ్ షాట్ ఫోటోకు ‘సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం ఇదే రోజు ఈ షాట్తో భారత అభిమానుల కోట్లాది హృదయాలు సంతోషంతో ఉప్పొంగాయి' అని క్యాప్షన్గా పేర్కొంది. అయితే ఈ ట్వీట్ చూసిన మాజీ క్రికెటర్, ఆ నాటి ప్లేయర్ గౌతం గంభీర్కు చిర్రెత్తుకొచ్చింది.
వెంటనే ‘క్రిక్ఇన్ఫో .. 2011 వన్డే వరల్డ్కప్ భారత్ అంతా కలిసి సాధించింది. ముఖ్యంగా భారత జట్టు, సహాయక సిబ్బంది వల్లనే ఇది సాధ్యమైంది. ధోనీ సిక్సర్ ఒక్కటే విజయాన్నందించలేదు. సమష్టి ఆటతీరువల్లే ఈ విజయం దక్కింది'అని గుర్తు చేస్తూ గంభీర్ బదులిచ్చాడు.
గంభీర్ సూపర్ ఇన్నింగ్స్..
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. కెప్టెన్ మహేల జయవర్దనె (103 నాటౌట్: 88 బంతుల్లో 13x4) అజేయ సెంచరీతో చెలరేగాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ వీరేంద్ర సెహ్వాగ్ (0), సచిన్ టెండూల్కర్ (18) వికెట్లను ప్రారంభంలోనే కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో గౌతమ్ గంభీర్ ( 122 బంతుల్లో 9 ఫోర్లు 97), నాటి యువ ప్లేయర్ విరాట్ కోహ్లీ (35)తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు.
కోహ్లీ ఔటైనా.. ధోనీతో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. నాలుగో వికెట్కి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
క్రెడిట్ అంతా ధోనీకే..
అయితే సెంచరీ చేరువైన క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన గంభీర్ క్లీన్ బౌల్డ్గా వెనుదిరిగాడు. ఇలా తాను ఔటవ్వడానికి కూడా ధోనీనే కారణమని ఇటీవల గంభీర్ తెలిపాడు. తన స్కోర్ చెప్పడంతోనే తీవ్ర ఒత్తిడికి లోనై ఔట్ కావాల్సి వచ్చిందన్నాడు. ఇక గంభీర్ ఔటైనా.. యువరాజ్తో కలిసి ధోనీ ( 79 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 91 నాటౌట్) 48.2 ఓవర్లలోనే 277/4తో మ్యాచ్ను ముగించాడు. అయితే ధోనీ సూపర్ ఇన్నింగ్స్, కెప్టెన్సీతో గంభీర్కు అంతగా పేరు రాలేదు. నిజానికి ఒత్తిడిని జయించి భారత్ను ఒడ్డుకు చేర్చింది మాత్రం గంభీరే. కానీ ఆఖర్లో ధోనీ ధాటిగా ఆడుకున్నా విజయం దక్కేది కాదు.
2011 ప్రపంచకప్ ఒక్కటే కాదు..
2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్ అనగానే అందరికీ మిస్బావుల్ క్యాచ్ను శ్రీశాంత్ అందుకున్న దృశ్యమే గుర్తుకొస్తుంది! ఆ మ్యాచ్ చివరి ఓవర్ వేసిన జోగిందర్ శర్మను కూడా తలుచుకుంటాం. ధోని కెప్టెన్సీని కూడా పొగిడేస్తాం! కానీ ఆ మ్యాచ్లో మిగతా బ్యాట్స్మెన్ అంతా చేతులెత్తేసినా మొండిగా పోరాడి భారత్కు పోరాడే స్కోరు అందించింది మాత్రం గంభీర్ అనే విషయం చాలామందికి గుర్తుండకపోవచ్చు.
మిగతా బ్యాట్స్మెన్ ఒక్కొక్కరు పాక్ బౌలర్ల ధాటికి తాళలేక వెనుదిరుగుతుంటే.. అతను అద్భుత బ్యాటింగ్తో 54 బంతుల్లోనే 75 పరుగులు చేసి స్కోరును 155కు చేర్చాడు. భారత్ సగర్వంగా ట్రోఫీ అందుకున్న ఆ పోరులో గంభీర్ది కీలక పాత్ర. కానీ ఈ రెండు ప్రపంచకప్ విజయాల్లో గంభీర్ పేరు మాత్రం వినిపించదు.