వెల్లింగ్టన్: భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఆడడం కష్టం. కానీ.. అదృష్టవశాత్తూ మూడో మ్యాచ్లో అతన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం అని న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ పేర్కొన్నాడు. బుమ్రాపై కేన్ విలియమ్సన్ ఆధిపత్యం చెలాయించాడు. కేన్ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు అని ప్రశంసించాడు. ప్రస్తుతం భారత్ అద్భుతంగా ఆడుతోంది, టీమిండియాలో అందరూ విజేతలేనని ఐపీఎల్లోనే నిరూపించారన్నాడు.
'మైదానం బయట ఉండాలని ఎవరనుకుంటారు.. పునరాగమనం చేయాలనుంది'
వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మరికొద్ది సేపట్లో నాలుగో టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ సందర్భంగా గురువారం గ్యారీ స్టీడ్ మీడియాతో మాట్లాడాడు. 'ప్రస్తుత టీమిండియా జట్టు అద్భుతంగా ఆడుతోంది. జట్టులో టాప్ ఆర్డర్ నుంచి చివరి వరకు ఎంతో పటిష్ఠంగా ఉంది. అందరూ మ్యాచ్ విజేతలమే అని ఇప్పటికే ఐపీఎల్లో నిరూపించారు. చాలా మంది ఐపీఎల్ మ్యాచులలో ఒత్తిడిలో ఆడారు. ఆ అనుభవంతో ఇప్పుడు వారికి పనికొస్తుంది. ఉత్కంఠ సమయాల్లో కూడా గొప్పగా ఆడుతున్నారు. తర్వాత టీ20 మ్యాచ్లో.. వన్డే, టెస్ట్ సిరీస్లోనూ రాణిస్తారని అనుకుంటున్నా' అని తెలిపారు.
'బుమ్రా బౌలింగ్ ఎంతో కఠినంగా ఉంటుంది. అతడిని ఎదుర్కోవడం చాలా కష్టం. కానీ.. అదృష్టవశాత్తూ మేం మూడో మ్యాచ్లో సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. బుమ్రాపై విలియమ్సన్ ఆధిపత్యం చెలాయించాడు. మూడో మ్యాచ్లో కేన్ అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. విజయానికి చేరువగా వచ్చి ఓడిపోయాం. ఇది కాస్త బాధించే విషయం. మిగతా రెండు మ్యాచులలో మేం మరింత రాణించాల్సి ఉంది' అని గ్యారీ చెప్పుకొచ్చాడు.
మూడో టీ20 'టై' అయిన నేపథ్యంలో సూపర్ ఓవర్ ఆడగా రోహిత్ శర్మ వరుస సిక్సులతో విజృంభించడంతో టీమిండియా ఘన విజయం సాధించింది. అంతకుముందు మొహమ్మద్ షమీ (2/32) సంచలన ప్రదర్శనతో మ్యాచ్ టై అయింది. విలియమ్సన్ (95) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడినా ఫలితం లేకుండా పోయింది. ఐదు టీ20ల సిరీస్లో ప్రస్తుతం భారత్ 3-0తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే.