హైదరాబాద్: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఎంపికకానున్నాడా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం బీసీసీఐ కొత్త రాజ్యాంగాన్ని సుప్రీంకోర్టు ఆమోదించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఒక రాష్ట్రం-ఒక ఓటు నిబంధన రద్దవగా బోర్డులో పదవీకాలం మధ్య విరామం వెసులబాటు కూడా పెరగడంతో గంగూలీకి మార్గం సుగమమైనట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. బీసీసీఐలో లోధా సంస్కరణలను అమలు చేయడంలో అలక్ష్యం వహించినందుకు గాను అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ని 2017లో సుప్రీంకోర్టు బాధ్యతల నుంచి తప్పించింది.
అప్పటి నుంచి తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా ఆ బాధ్యతలను చూసుకుంటున్నారు. తాజాగా సుప్రీం కోర్టు బీసీసీఐ కొత్త రాజ్యాంగానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మళ్లీ అధ్యక్షుడ్ని నియమించుకోవాలని బీసీసీఐ అధికారులు యోచిస్తున్నారు. ఈ క్రమమంలో బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ పేరు తెరపైకి వచ్చింది.
సౌరవ్ గంగూలీ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ (క్యాబ్) అధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తూ మరోవైపు కామెంటేటర్గానూ పనిచేస్తున్నాడు. వాస్తవానికి 2015లో అప్పటి అధ్యక్షుడు జగన్మోహన్ దాల్మియా గుండె పోటుతో మరణించడంతో గంగూలీ ఆ బాధ్యతలు చేపడతాడని అందరూ ఊహించారు.
కానీ.. అనూహ్యంగా అనురాగ్ ఠాకూర్ తెరపైకి వచ్చారు. తాజాగా గంగూలీ కోరుకుంటే.. అతను అధ్యక్షుడయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. కాగా, భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలాడిన గంగూలీ.. బీసీసీఐ అందించిన అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు.
టీమిండియాకి దూకుడు నేర్పిన కెప్టెన్గా అతను చరిత్రలో నిలిచిపోయాడు. 2008, నవంబరులో అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన గంగూలీ.. ఆ తర్వాత బీసీసీఐతో కలిసి దేశంలో క్రికెట్ అభివృద్ధికి పనిచేస్తున్నాడు.