లండన్: బర్మింగ్ హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్పై భారత్ ఆధిపత్యాన్ని సాధించింది. మ్యాచ్పై పట్టు బిగించింది. ఇంకాస్సేపట్లో మూడో రోజు ఆట ఆరంభం కానుంది. రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 84 పరుగులకు అయిదు వికెట్లను కోల్పోయింది. ఇందులో మూడు.. బుమ్రా కూల్చినవే. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
ఇంగ్లాండ్ జట్టు ఫాలో ఆన్ను ఎదుర్కొనే ప్రమాదంలో పడినట్టే కనిపిస్తోంది. జానీ బెయిర్స్టో-12, కేప్టెన్ బెన్ స్టోక్స్-0 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. మూడో రోజు వీరిద్దరి బ్యాటింగ్ మీదే ఇంగ్లాండ్ టీమ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. బెయిర్ స్టో, బెన్ స్టోక్స్.. భారీ స్కోర్ సాధిస్తే గానీ ఇంగ్లాండ్ ఓటమి కోరల నుంచి దాదాపుగా తప్పించుకోలేకపోవచ్చు. ఇప్పటికే 2-1 తేడాతో ఈ టెస్ట్ సిరీస్లో భారత జట్టు ఆధిక్యతలో ఉంది.
కాగా రెండో రోజు కేప్టెన్ జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్.. ఇంగ్లాండ్ను మైండ్ బ్లాక్ చేసింది. స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ను అతను ఉతికి ఆరేశాడు. ఏకంగా 35 పరుగులు పిండుకున్నాడు. రెండు సిక్సర్లు, నాలుగు ఫోర్లు బాదాడా బౌలింగ్లో. టీ20 ఫార్మట్లో సాగింది బుమ్రా బ్యాటింగ్ స్టైల్. 16 బంతుల్లో 31 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇది టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రిని ఆకట్టుకుంది. బుమ్రా ఓ ప్రొఫెషనల్ బ్యాటర్లా కనిపించాడని, క్లీన్ షాట్స్ ఆడాడని ప్రశంసించాడు.
ఇదివరకు టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్లో యువరాజ్ సింగ్ కొట్టిన ఆరు సిక్సర్లతో బుమ్రా బ్యాటింగ్ను పోల్చాడు. పర్ఫెక్ట్ షాట్స్ ఆడాడని, ప్రతి బంతినీ బ్యాట్తో వందశాతం కనెక్ట్ చేశాడని చెప్పాడు. యువరాజ్ సింగ్ ఆడిన ఇన్నింగ్కు సంబంధించిన ఫొటోలను తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్పై పోస్ట్ చేశాడు. బ్యాటింగ్ పట్ల అతనికి ఎంత ఆసక్తి ఉందనేది ఈ ఇన్నింగ్తో తేలిందని పేర్కొన్నాడు. భవిష్యత్తులో కేప్టెన్గా అతని పేరును పరిశీలించవచ్చని వ్యాఖ్యానించాడు.
భారత జట్టు ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ను గెలవడం, ఇంగ్లాండ్తో ఆడుతున్న సిరీస్లో 2-1 తేడాతో ఆధిక్యతలో ఉండటం వంటి పరిణామాలు టెస్ట్ ఫార్మట్లో భారత్ సత్తాను చాటిందని పేర్కొన్నాడు. టెస్టుల్లో భారత్ ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీనని కితాబిచ్చాడు. ఇదే దూకుడును ఇకముందు అన్ని ఫార్మట్లల్లోనూ కొనసాగిస్తుందని వ్యాఖ్యానించాడు.