లంకతో జరిగిన రెండో వన్డేలో భారత్ తరఫున అత్యుత్తమంగా బౌలింగ్ చేసిన బౌలర్ కుల్దీప్ యాదవ్. మ్యాచ్కు ముందు యుజ్వేంద్ర చాహల్ భుజానికి గాయం అవడంతో కుల్దీప్కు ఈ మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది. దీన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న అతను.. లంక బ్యాటింగ్ లైనప్కు ముచ్చెమటలు పోయించాడు. వన్ డౌన్లో వచ్చిన కుశాల్ మెండిస్ను ఎల్బీగా అవుట్ చేశాడు.
మెండిస్ అవుటైన తర్వాత లంక సారధి, భారత బౌలర్లను ఒక ఆట ఆడుకుంటున్న దాసున్ షనక క్రీజులోకి వచ్చాడు. అతను రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగానే కుల్దీప్ అతన్ని క్లీన్బౌల్డ్ చేశాడు. కుల్దీప్ వేసిన బంతిని స్వీప్ చేసేందుకు షనక ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఎడం కాలును అనుకున్న దాని కన్నా ఎక్కువ ముందుకు వేసేశాడు. దీంతో బ్యాటర్ వెనుక గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ గుండా ప్రయాణించిన బంతి వికెట్లను కూల్చింది. ఆ తర్వాత కాసేపటికి మళ్లీ బంతి అందుకున్న కుల్దీప్.. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన చరిత్ ఆశలంకను అవుట్ చేశాడు.
వన్డేల్లో టీమిండియాకు కుల్దీప్ వంటి బౌలర్ కచ్చితంగా కావాలని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా ఇదే అన్నాడు. 'టీ20 క్రికెట్లో ఉన్నట్లు 50 ఓవర్ల క్రికెట్లో స్లాగ్లు ఎక్కువగా ఆడరు. ఎక్కువగా పుష్ చేయడం, డిఫెండ్ చేసుకోవడమే జరుగుతుంది. కాబట్టి అలాంటి బ్యాటర్లు బోల్తా కొట్టించగలిగే బౌలర్లు కావాల్సి ఉంటుంది.
ఎంతైనా డిఫెండ్ చేసుకునే బ్యాటర్ను కూడా అవుట్ చేయాలి కదా. కుల్దీప్ వద్ద ఆ ట్యాలెంట్ ఉంది' అని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. గౌతమ్ గంభీర్ వంటి మాజీలు కూడా కుల్దీప్ను తెగ మెచ్చుకున్నారు. చాహల్ ఫిట్గా ఉన్నా కూడా కుల్దీప్ మన జట్టులో ఎక్స్ఫ్యాక్టర్గా మారతాడని కొనియాడారు.