రిస్క్ లేని ఆట..
కోహ్లీ ఎక్కువ రిస్కులు తీసుకోవడం మనం ఎప్పుడూ చూడమని చెప్పిన గవాస్కర్.. రోహిత్ తదితరులు కూడా అతన్నే అనుసరించడం మంచిదని చెప్పాడు. వీళ్లందరూ రకరకాలుగా సిక్సర్లు కొట్టేందుకు ప్రయత్నిస్తూ వికెట్ పారేసుకుంటున్నారని విశ్లేషించాడు. 'పరిమిత ఓవర్ల క్రికెట్లో కేవలం సిక్సర్లే కొట్టాల్సిన అవసరం లేదు. ఫోర్, సిక్స్ మధ్య తేడా రెండు పరుగులే అని తెలుసుకోవాలి. కానీ వీటి మధ్య రిస్క్ చాలా ఎక్కువ. ఫోర్ కొట్టే సమయంలో అవుటవడం కన్నా.. సిక్స్ కొట్టే సమయంలో అవుటయ్యే ప్రమాదం 90 శాతం ఎక్కువగా ఉంటుంది' అని వివరించాడు.
రోహిత్, శ్రేయాస్ చేసే పొరపాటు
కోహ్లీ వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తగలడు. ఇదే విషయాన్ని చెప్పిన గవాస్కర్.. కోహ్లీకి ఇదే తన బలమని తెలుసని తెలిపాడు. 'కోహ్లీ వికెట్ల మధ్య అద్భుతంగా పరిగెడతాడు. ఆ విషయం అతనికి కూడా తెలుసు. అతను కేవలం తన కోసమే కాదు, తన పార్టనర్ కోసం కూడా పరిగెడతాడు' అని చెప్పాడు. గిల్, శ్రేయాస్, రోహిత్ బ్యాటింగ్ గమనిస్తే.. వాళ్లు ఎక్కువ రిస్క్ తీసుకోవడం కనిపిస్తుందని గవాస్కర్ వెల్లడించాడు. వాళ్లందరూ అనవసరంగా సిక్సర్లు కొట్టేందుకు ప్రయత్నించడమే దీనికి కారణమని స్పష్టం చేశాడు.
అదే కోహ్లీ గొప్పతనం..
కోహ్లీ తను సెంచరీ చేసే వరకూ నేల బారుగానే షాట్లు ఆడతాడని గుర్తుచేశాడు. చాలా అరుదుగానే సిక్సర్లు కొట్టేందుకు ప్రయత్నిస్తాడని వివరించాడు. ఆ తర్వాత గేరు మార్చి లాఫ్ట్ షాట్లు ఆడుతుంటాడని చెప్పాడు. ఇలా రిస్క్ లేకుండా ఆడుతున్నప్పటికీ కోహ్లీ స్ట్రైక్ రేటు 100పైగానే ఉండటం చాలా గొప్ప విషయం అని గవాస్కర్ తేల్చిచెప్పాడు. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో అత్యద్భుతంగా ఆడిన విరాట్.. ఏకంగా 166 పరుగులతో అజేయంగా నిలిచాడు. న్యూజిల్యాండ్పై కూడా అతను అదే మాదిరి రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు.