జీవితం సాఫీగా సాగుతోంది అనుకునే సమయంలోనే కొన్ని కష్టాలు వచ్చి పడతాయి. మనసులను దుఃఖంలో ముంచేస్తాయి. క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్కు ఇప్పుడు అలాగే జరిగింది. ఈ మాజీ లెజెండ్ కామెంటేటర్గా, క్రికెట్ అనలిస్టుగా మంచి ఖ్యాతి గడించాడు. తాజాగా భారత్, బంగ్లాదేశ్ ఆడిన టెస్టు సిరీస్లో కూడా కామెంటరీ ప్యానెల్లో ఉన్నాడు. అక్కడ అతను బంగ్లాదేశ్, భారత్ టెస్టు మ్యాచ్ కామెంటరీ చెప్తున్నప్పుడే స్వదేశంలో అతని కుటుంబాన్ని విషాదం కమ్మేసింది.
సునీల్ గవాస్కర్ తల్లి మీనా కన్నుమూశారు. భారత జట్టు మాజీ స్టంపర్, బాంబే క్రికెట్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ మాధవ్ మంత్రి చెల్లెలు అయిన మీనాకు గవాస్కర్ సహా మరో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. భర్త మనోహర్తో కలిసి గవాస్కర్ను మంచి క్రికెటర్గా తయారు చేయడంలో మీనా చాలా కీలక పాత్ర పోషించారు. 95 ఏళ్ల ఆమె వృద్ధ్యాప్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారని, వాటితోనే తుదిశ్వాస విడిచారని తెలుస్తోంది. మీనా దంపతులకు గవాస్కర్, అతని సోదరీమణులు కవిత, నూతన్ ముగ్గురు పిల్లలు. వీళ్లతోపాటు ముగ్గరు మనుమలు, నలుగురు మునిమనుమలతో మీనా సంతోషంగా సమయం గడిపేవారు.
చిన్నతనం నుంచి గవాస్కర్కు క్రికెట్ నేర్పించే పనిని మీనా కూడా తీసుకున్నారు. చిన్న వాడైన గవాస్కర్కు టెన్నిస్ బాల్తో తనే బౌలింగ్ వేసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయించేవారు. అలా ఒకసారి ఆమె బౌలింగ్ చేస్తుండగా గవాస్కర్ బలంగా ఒక షాట్ కొట్టాడు. ఆ బంతి నేరుగా వెళ్లి తల్లి మీనా ముక్కుకు తగిలింది. దీంతో గాయమై ఆమె ముక్కు నుంచి రక్తం కారడం మొదలైంది. ఇది చూసిన గవాస్కర్ కంగారు పడిపోయాడు. అయితే మీనా మాత్రం నవ్వుతూ ముక్కు తుడుచుకొని మళ్లీ బౌలింగ్ చేశారట. ఈ విషయాన్ని గవాస్కర్ ఆ తర్వాత వెల్లడించారు.