టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది:
సోమవారం వెబినార్లో అనిల్ కుంబ్లే మాట్లాడుతూ... 'ఇప్పటికే క్రికెట్లో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్) ప్రభావం ఎంతగానో ఉంది. అది మంచి ఫలితాలను కూడా ఇస్తోంది. భవిష్యత్తులో నిర్ణయాత్మక విధానాలు తీసుకోవడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఆవిష్కరణలను ఆటగాళ్లు అంగీకరించాలి. లేకుంటే.. మీరు వెనుకబడిపోతారు. మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త సాంకేతికతను ఉపయోగించుకోవడం ఆటకూ మంచిది. ఎలాంటి పొరపాట్లు, తప్పిదాలు జరగకుండా టెక్నాలజీ ద్వారా సరైన నిర్ణయాలు వెలుబడుతాయి' అని అన్నారు.
ఆటకు మంచి చేస్తుంది:
క్రికెట్లో సాంకేతికత అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా అది ఆటకు మంచి చేస్తుందని, అందుకే అది ఆహ్వానించదగ్గ విషయమని స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే తెలిపారు. ఈ క్రమంలోనే క్రీడల్లోనూ ఓటీటీలు వస్తాయని పేర్కొన్నారు. ఇకపై ఆటలలో టీవీలు, ప్రసారదారుల ప్రభావం అధికంగా ఉండదన్నారు. క్రీడా సమాఖ్యలు సైతం ప్రజలకు చేరువ అయ్యేందుకు సాంకేతికతను విరివిగా ఉపయోగించుకుంటారని జంబో అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ కెరీర్లో కుంబ్లే 132 టెస్టుల్లో, 271 వన్డే మ్యాచ్ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. టెస్టుల్లో 619, వన్డేల్లో 337 వికెట్లు పడగొట్టారు. ఇక 42 ఐపీఎల్ మ్యాచులలో 45 వికెట్లు తీశారు. ప్రస్తుతం జంబో కింగ్స్ పంజాబ్ జట్టుకు కోచ్గా ఉన్నారు.
ఓటీటీలు వస్తాయి:
ఆటలను ప్రజలకు చేరువ చేసేందుకు ఇన్ని రోజులు టీవీలు కీలక పాత్ర పోషించాయని, ఇకపై ఓటీటీలు వస్తాయని టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే వివరించారు. ఈ మార్పుల కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు క్రికెట్లో పరిమిత ఓవర్ల ఫార్మాట్లు పెరిగేకొద్దీ 'డేటా ఇంటిలిజెన్స్' అధికమవుతుందని ఆయన అంచనా వేశారు. ఆటలు ఎంత చిన్నగా మారితే డేటా ఇంటిలెజెన్స్ వినియోగం అంత ఎక్కువగా ఉంటుందని కుంబ్లే చెప్పుకొచ్చారు. కుంబ్లే టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా ఉన్నారు. టెస్ట్ ఫార్మాట్లో ఇప్పటివరకూ అత్యధిక వికెట్లు తీసిన వారిలో శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో అగ్రస్థానంలో నిలవగా.. ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ 708 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కుంబ్లే ఇన్నాళ్లూ 619 వికెట్లతో మూడో స్థానంలో ఉండగా.. ఆ రికార్డును తాజాగా జేమ్స్ అండర్సన్ (632) బద్దలుకొట్టాడు.
టీమిండియా కోచ్గా:
అనిల్ కుంబ్లే టీమిండియా కోచ్గా కూడా ఏడాది కాలం పనిచేశారు. అయితే 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ముందు అనూహ్యంగా కోచ్ పదవి నుంచి ఆయన తప్పుకున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లే మొదట్లో బాగానే ఉన్నా.. జంబో తరహా క్రమశిక్షణ విరాట్కు నచ్చలేదు. ఇద్దరి మధ్య కొన్ని విషయాల్లో అభిప్రాయభేదాలు రావడంతో.. కుంబ్లేనే హుందాగా తన పదవి నుంచి తప్పుకున్నారు. భారత దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్ వారిద్దరి మధ్య సయోధ్య కుదుర్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.