కోహ్లీపైనే భారం..
ఈ సిరీస్ ముందే భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. ఫామ్లో ఉన్న శ్రేయాస్ అయ్యర్, టెస్టు స్పెషలిస్టు రిషభ్ పంత్, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ముగ్గురూ గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఈ క్రమంలో భారత బ్యాటింగ్ భారం ఎక్కువగా మిడిలార్డర్పై పడనుంది. వీరిలో కూడా విరాట్ కోహ్లీపై మరీ ఎక్కువగా ఈ భారం ఉంటుంది. ఎందుకంటే మిడిలార్డర్లో ప్రధాన బ్యాటర్ కోహ్లీనే. దానికితోడు కొంతకాలంగా టెస్టుల్లో కోహ్లీ ఫామ్లో లేడు. దీంతో అందరి చూపు అతను ఎలా ఆడతాడనే విషయంపై ఉంటుంది.
లియాన్ పెద్ద తలనొప్పి..
అయితే ఆస్ట్రేలియా జట్టులో కోహ్లీకి తలనొప్పిగా మారే బౌలర్ ఒకే ఒక్కడు ఉన్నాడు. అతనే ఆఫ్స్పిన్నర్ నాథన్ లియాన్. అతను అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీని ఇప్పటి వరకు ఏడుసార్లు అవుట్ చేశాడు. వీటిలో నాలుగు సార్లు భారత గడ్డపైనే కోహ్లీని బుట్టలో వేసుకున్నాడు. ఇప్పుడు మిగతా ఆటగాళ్లపై ఆధార పడే అవకాశం లేకపోవడంతో.. లియాన్ను కోహ్లీ ఎలా ఎదుర్కుంటాడనే ప్రశ్న అభిమానుల మనసులను తొలిచేస్తోంది. దీనిపై భారత జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ వివరణ ఇచ్చాడు.
అదొక్కటే మార్గం..
'లియాన్ను ఎదుర్కొనే సమయంలో కోహ్లీ రెండు పొరపాట్లు చేస్తున్నాడు. అవే అతనికి ప్రమాదకరంగా మారుతున్నాయి. అవేంటంటే.. అతను ఫ్రంట్ ఫుట్పై ఆడేందుకు సంకోచిస్తాడు. రెండోది.. ఎక్కువగా క్రీజులోనే ఉండి ఆడతాడు. స్వీప్ షాట్ కూడా ఆడటానికి కోహ్లీ ప్రయత్నించడు. ఇలాంటి సమయంలో లియాన్ ప్రమాదాన్ని అరికట్టాలంటే కోహ్లీ ముందుకు దూకకతప్పదు' అని బంగర్ వివరించాడు. లియాన్ బౌలింగ్లో పరుగులు చేయాలంటే కోహ్లీ క్రీజు వదిలి రాక తప్పదని బంగర్ తేల్చేశాడు. పొట్టి ఫార్మాట్లో స్పిన్నర్లపై ఇలాగే కోహ్లీ ఎదురుదాడికి దిగాడని, టెస్టుల్లో కూడా అదే చేయకతప్పదని విశ్లేషించాడు.