
హైదరాబాద్: విండిస్ పర్యటనలో చెత్త ప్రదర్శన కారణంగా కేఎల్ రాహుల్ భారత జట్టుకు దూరమయ్యాడు. విండిస్ పర్యటనలో ఓపెనర్గా కేఎల్ రాహుల్ నాలుగు ఇన్నింగ్స్ల్లో 44, 38, 13, 6లతో పేలవ ప్రదర్శన చేశాడు. ఫలితంగా దక్షిణాఫ్రికాతో జరగబోయే మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో చోటు కోల్పోయాడు.
కేఎల్ రాహుల్ స్థానంలో యువ క్రికెటర్ శుభమాన్ గిల్కు సెలక్టర్లు చోటు కల్పించారు. టెస్టు సిరిస్కు ముందు జరిగిన మూడు టీ20ల సిరిస్లో సైతం కేఎల్ రాహుల్ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ధర్మశాల వేదకగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా... రెండో టీ20లో టీమిండియా విజయం సాధించింది.
ఇక, మూడో టీ20లో దక్షిణాఫ్రికా విజయం సాధించడంతో మూడు టీ20ల సిరిస్ 1-1తో సమం అయింది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరిస్కు జట్టులో చోటు దక్కకపోవడంతో కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా కేఎల్ రాహుల్ పోస్టు చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విమర్శలకు తావిచ్చింది.
కేఎల్ రాహుల్ స్టీమ్ బాత్ చేస్తోన్న ఫోటోని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ "చిల్లింగ్" అనే కామెంట్ పోస్టు చేశాడు. ఈ పోస్టుపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. 'ముందు జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోమని చెప్పండి' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
మరొక నెటిజన్ "అక్కడే చిల్ అవుతా ఉండు. మళ్లీ మైదానంలోనికి అడుగుపెట్టొద్దు. నిన్ను చూడటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. నీ సింగిల్ డిజిట్ స్కోర్లు చూసి మేం చిల్ అవుతున్నాం" అంటూ కామెంట్ పెట్టాడు. భారత జట్టులో చోటు దక్కించుకోలేని కేఎల్ రాహుల్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో భాగంగా విజయ్ హాజారే ట్రోఫీలో ఆడుతున్నాడు.
ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు కోహ్లీసేనతో మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో తలపడనుంది. ఇందులో భాగంగా తొలి టెస్టు అక్టోబర్ 2న విశాఖపట్నం వేదికగా ప్రారంభం కానుంది. ఆ తర్వాతి రెండు టెస్టులకు పూణె, రాంచీలు ఆతిథ్యమిస్తున్నాయి.