విరాట్ కోహ్లీ - 112, డర్బన్
ఈ ఏడాది మొదట్లో సఫారీ గడ్డపై జరిగిన ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టులో కెప్టెన్ డుప్లెసిస్ సెంచరీతో ఆతిధ్య జట్టు 269/8 పరుగులు చేసింది. అనంతరం 270 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కోహ్లీ సెంచరీతో 5.3 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని చేధించింది. దీంతో చేధనలో కోహ్లీకి మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. ఈ సెంచరీ వన్డేల్లో విరాట్ కోహ్లీ సత్తాకు మైలురాయిగా నిలిచింది.
విరాట్ కోహ్లీ - 160, కేప్ టౌన్
సఫారీ పర్యటనలో భాగంగా టీమిండియాకు ఇది మూడో వన్డే. ఓపెనర్ రోహిత్ శర్మ వికెట్ను త్వరగానే కోల్పోయినప్పటికీ... మరో ఓపెనర్ శిఖర్ ధావన్తో కలిసి విరాట్ కోహ్లీ రెండో వికెట్కు 140 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో చివరి వరకు క్రీజులో నిలబడిన కోహ్లీ 159 బంతుల్లో 160 పరుగులతో సెంచరీ సాధించాడు. కోహ్లీ సెంచరీతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో భారత్ 124 పరుగుల తేడాతో విజయం సాధించింది.
రోహిత్ శర్మ - 137, నాటింగ్ హామ్
ట్రెంట్ బ్రిడ్జి వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్తో జరిగిన ఈ మ్యాచ్లో ఓపెనర్ శిఖర్ ధావన్ 40 పరుగులకే పెవిలియన్కు చేరినప్పటికీ, రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీల జోడీ నిలకడగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. రోహిత్ శర్మ ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని 114 బంతుల్లో 15 పోర్లు, 4 సిక్సులతో సెంచరీని సాధించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ 6 వికెట్లు తీయడం విశేషం.
శిఖర్ ధావన్ - 114, దుబాయి
ఆసియా కప్లో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ చెలరేగి ఆడాడు. ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచ్లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 237 పరుగులు చేసింది. అనంతరం 238 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టులో ధావన్ 16 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 114 పరుగులతో రాణించడంతో భారత్ 33.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. పాక్ బౌలర్లలో మహమ్మద్ ఆమీర్, హసాన్ అలీ బౌలింగ్ను ధావన్ ఉతికి ఆరేశాడు. ఈ మ్యాచ్లో ధావన్, రోహిత్ శర్మలు ఓపెనింగ్ స్టాండ్కు 210 పరుగులు జోడించారు.
అంబటి రాయుడు - 100, ముంబై
ఐసీసీ వరల్డ్ కప్ 2019లో అంబటి రాయుడు నాలుగో స్థానానికి చక్కగా సరిపోతాడని చెప్పిన ఇన్నింగ్స్ ఇదే. ముంబై వేదికగా వెస్టిండిస్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్లో అంబటి రాయుడు విజృంభించాడు. మొత్తం 81 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులతో 100 సెంచరీ సాధించాడు. ఇదే మ్యాచ్లో రోహిత్ శర్మ కూడా సెంచరీతో చెలరేగినప్పటికీ అంబటి రాయుడి ఇన్నింగ్సే మ్యాచ్కు హైలెట్గా నిలిచింది. దీంతో భారత్ వెస్టిండిస్కు 378 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండిస్ జట్టు 153 పరుగలకే ఆలౌటైంది. దీంతో టీమిండియా 224 పరుగుల తేడాతో విజయం సాధించింది.