
'అందరికీ ఈ విషయం తెలియజేయడానికి సంతోషంగా ఉంది. తాజా ఆర్టీపీసీఆర్ పరీక్షలో నాకు కరోనా నెగిటివ్గా వచ్చింది. ఇప్పుడు కోలుకొని బాగా ఉన్నా. నేను మీ అందరికీ ఒకే విషయం చెప్పదల్చుకున్నా. జాగ్రత్తగా ఉంటూ కచ్చితమైన నిబంధనలు పాటించండి. కరోనా వైరస్ అనేది నిజం. చాలా ప్రమాదకరం కూడా. అధికారులు చెప్తున్న అన్ని నియమాలూ కచ్చితంగా పాటించండి. ఇప్పుడు కరోనాతో పోరాడుతున్న వారంతా మరింత బాగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను' అంటూ హర్మన్ప్రీత్ కౌర్ ట్వీట్ చేశారు.
లక్నోలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో భాగంగా మార్చి 17న జరిగిన చివరి వన్డేలో హర్మన్ప్రీత్ కౌర్ ఆడారు. ఆ మ్యాచులో 55 బంతుల్లో 30 పరుగులు చేశారు. అయితే గాయం కారణంగా ఆ మ్యాచ్ మధ్య నుంచే తప్పుకున్నారు. అనంతరం జరిగిన టీ20 సిరీస్లో హర్మన్ప్రీత్ ఆడలేదు. పాటియాలాలోని తన నివాసంలో ఉంటున్న ఆమెకు నాలుగు రోజుల నుంచి స్వల్పంగా జ్వరం రావడంతో కౌర్ మార్చి 30న కరోనా పరీక్ష చేయించుకున్నారు. కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. దాంతో రెండు వారాలు ఇంట్లోనే క్వారంటైన్లో ఉన్నారు. ఇప్పుడు ఆమె పూర్తిగా కోలుకున్నారు.
భారత్ తరఫున 100 వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన ఐదో భారత మహిళా క్రికెటర్గా హర్మన్ప్రీత్ కౌర్ నిలిచిన విషయం తెలిసిందే. లక్నో వేదికగా జరిగిన తొలి వన్డేలో ఈ మైలురాయి అందుకున్నారు. కౌర్ భారత్ తరఫున 2 టెస్టులు, 104 వన్డేలు, 114 టీ20లు ఆడారు. మొత్తంగా 4 సెంచరీలు, 18 అర్ధ సెంచరీలు చేశారు. టీమిండియా మాజీ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, ఎస్ బద్రీనాథ్, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు.