బ్రావో కౌంటీల్లో ఆడేందుకు లండన్
మరో పక్క బ్రావో కౌంటీల్లో ఆడేందుకు లండన్ వచ్చాడు. ఈ క్రమంలోనే ధోనీ, పాండ్య, బ్రావో కలిశారు. ముగ్గురూ కలిసి డిన్నర్ చేశారు. ఈ ఫొటోను బ్రావో ఇన్స్టాగ్రాం ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ‘నా సోదరులు మహేంద్ర సింగ్ ధోనీ, హార్దిక్ పాండ్యతో డిన్నర్ చేస్తున్నా. కెప్టెన్ కూల్ ధోనీని కలవడం చాలా సంతోషంగా ఉంది' అని బ్రావో పేర్కొన్నాడు. ఐపీఎల్లో ధోనీ నాయకత్వంలో చెన్నై సూపర్కింగ్స్ తరఫున బ్రావో ఆడిన సంగతి తెలిసిందే. దీంతో ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది.
ధోనీ.. సాక్షి, జీవాతో కలిసి బ్రావో ఇంటికి
గత ఏడాది టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన సమయంలోనూ ధోనీ.. సాక్షి, జీవాతో కలిసి బ్రావో ఇంటికి వెళ్లాడు. వన్డే సిరీస్లో భాగంగా జరిగిన రెండో వన్డేలో టీమిండియాపై ఇంగ్లాండ్.. 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. బ్యాట్స్మెన్ వైఫల్యంతో రెండో వన్డేలో భారత్ భంగపడింది.
రూట్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'
లక్ష్యఛేదనలో తడబడిన భారత్ 50 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌటైంది. రైనా (46; 63 బంతుల్లో ఒక ఫోర్), కోహ్లి (45; 56 బంతుల్లో 2ఫోర్లు) రాణించారు. ప్లంకెట్ (4/46), రషీద్ (2/38), విల్లీ (2/48) భారత్ను దెబ్బతీశారు. రూట్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. ధోని (37; 59 బంతుల్లో 2ఫోర్లు), హార్దిక్ పాండ్య (21) క్రీజులో ఉన్నప్పుడు భారత్ కాస్త ఆశతోనే ఉంది.
సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే మంగళవారం
కానీ 39వ ఓవర్లో పాండ్య ఔట్ కావడంతో అది కూడా పోయింది. ధోని 47వ ఓవర్కు వరకు క్రీజులోనే ఉన్నా భారత్ ఏ దశలోనూ గెలిచేలా కనపడలేదు. కష్టంగా పరుగులొచ్చాయి. ధోని ఆట ఓటమి అంతరాన్ని తగ్గించడానికి సరిపోయిందంతే. టెయిలెండర్ల నుంచి ఎలాంటి ప్రతిఘటనా లేదు. దీంతో.. మూడు వన్డేల సిరీస్ 1-1తో సమమవగా.. సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే మంగళవారం జరగనుంది.