ద్రవిడ్ సర్ ఇచ్చిన ఆ ఒక్క సలహాతోనే: 17 ఏళ్ల యశస్వి జైస్వాల్

హైదరాబాద్: వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న ఐసీసీ అండర్-19 వరల్డ్కప్కు ఎంపికవడం పట్ల యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. తాను అండర్-19 వరల్డ్కప్కు ఎంపిక కావడం వెనుక అండర్-19 కోచ్, ఎన్సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్ కృషి ఎంతో ఉందని చెప్పుకొచ్చాడు.
దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 9 నుంచి జరగే అండర్-19 వరల్డ్కప్ టోర్నమెంట్కు బీసీసీఐ సోమవారం జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జట్టులో 17 ఏళ్ల యశస్వి జైస్వాల్కు చోటు లభించింది. ప్రతి బంతిపై దృష్టి పెట్టాలని ద్రవిడ్ సర్ తనకు సలహా ఇచ్చాడని, ఈ సూచన తనకు ఎంతో సహాయపడిందని జైస్వాల్ గురువారం తెలిపాడు.

ముంబైకి చెందిన యశస్వి జైస్వాల్
ముంబైకి చెందిన యశస్వి జైస్వాల్ విజయ్ హజారే ట్రోఫీలో చేసిన అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఈ నేపథ్యంలో జైస్వాల్ మాట్లాడుతూ "రాహుల్ (ద్రవిడ్) సార్ మాకు బాగా మార్గనిర్దేశం చేస్తారు. ప్రతీ బంతిపై ఫోకస్ పెట్టమని ద్రవిడ్ సర్ ఎప్పటి కప్పుడు చెబుతూ ఉండేవారు" అని అన్నాడు.

ఆ బంతిపై దృష్టి కేంద్రీకరించాలి
"ఏ బంతిని నువ్వు ఎదుర్కొంటున్నావో అప్పుడు ఆ బంతిపై దృష్టి కేంద్రీకరించాలి అని చెప్పేవారు. ముఖ్యంగా ప్రాక్టీస్ సెషనల్లో ఏ ఏరియాల్లో నేను బలహీనంగా ఉన్నానో వాటిని సరి చేసేవారు. ఇలా, ద్రవిడ్ సర్ చెప్పిన ప్రతీ విషయం నాకు ఎంతో సహాయపడింది" యశస్వి జైస్వాల్ పేర్కొన్నాడు.

తన ప్రదర్శన గురించి మాట్లాడుతూ
తన ప్రదర్శన గురించి జైస్వాల్ మాట్లాడుతూ "నేను ప్రతీ మ్యాచ్ను ఒకే రకంగా ఆస్వాదిస్తాను. నేను కింది స్థాయిలో ఎంత సహజ సిద్ధంగా ఆడానో అదే ప్రదర్శనను రిపీట్ చేయడంపై ఫోకస్ చేస్తా. నా ఆటపైనే దృష్టి పెడతా.. ఫలితాలపై కాదు. నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి శాయశక్తులా కృషి చేస్తా" అని జైస్వాల్ అన్నాడు.

విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీ
ఇటీవలే ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో మూడు సెంచరీలతో సత్తా చాటాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ ప్రదర్శనే అతడిని అండర్-19 వరల్డ్కప్ జట్టులో చోటు దక్కించుకునేలా చేసింది. అక్టోబర్లో జార్ఖండ్తో జరిగిన మ్యాచ్లో యశస్వి జైస్వాల్ 203 పరుగులు సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications