దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా మరికొద్దిసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ లోకేష్ రాహుల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం రాహుల్ తుది జట్టులో ఒక మార్పు చేశాడు. వరుసగా విఫలమవుతున్న నికోలస్ పూరన్ స్థానంలో క్రిస్ జోర్డాన్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. దాంతో మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనాకు నిరాశే ఎదురైంది. ఐపీఎల్ 2021 లీగ్ దశ చివరి అంకానికి చేరుకున్న విషయం తెలిసిందే.
ఈ సీజన్లో జరుగుతోన్న 53వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య దుబాయ్ మైదానంలో జరగనుంది. ఐపీఎల్ టోర్నీలో భాగంగా చెన్నై, పంజాబ్ జట్లు 25 సార్లు తలపడ్డాయి. ఇందులో చెన్నై 16 సార్లు గెలుపొందగా.. పంజాబ్ 9 విజయాలు అందుకుంది. ఐపీఎల్ 2021లో చెన్నై, పంజాబ్ తలపడిన మ్యాచులో ధోనీసేన విజయం సాదించింది. ఇరు జట్ల మధ్య చివరి ఐదు మ్యాచుల్లో నాలుగు చెన్నై, ఒకటి పంజాబ్ గెలిచింది. దుబాయ్ మైదానంలో ఇరు జట్ల మధ్య ఓ మ్యాచ్ జరగ్గా.. చెన్నై విజయాన్ని అందుకుంది. మ్యాచుకు ఎలాంటి వర్షపు ముప్పులేదు. ఇక్కడ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ ఉంది. దుబాయ్ మైదానం పెద్దది కాబట్టి భారీ స్కోర్ నమోదు కావడం అసాధ్యమే.
చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్కు అర్హత సాధించింది. ఆడిన 13 మ్యాచుల్లో 9 విజయాలతో పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఈ రోజు పంజాబ్ కింగ్స్ను ఓడించడం ద్వారా టాప్ 2లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ దాదాపుగా ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించినా ఏదో మూల చిన్న ఆశ ఉంది. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని పంజాబ్ జట్టు 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలవడం ఆ జట్టుకు తప్పనిసరి. ఒకవేళ గెలిస్తే భారీ తేడాతో గెలవాల్సి ఉంది. అయినా కూడా మిగతా జట్ల జయాపజయాలు, సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డుప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మోయిన్ అలీ, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్ చహర్, శార్దుల్ ఠాకూర్, జోష్ హాజెల్వుడ్.
పంజాబ్ కింగ్స్: లోకేష్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఐడెన్ మార్క్రామ్, షారుఖ్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, మొయిసెస్ హెన్రిక్స్, క్రిస్ జోర్డాన్, హర్ప్రీత్ బ్రార్, మహమ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్.