
హైదరాబాద్: చెన్నైలోని చెపాక్ స్టేడియం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టోర్నీలో భాగంగా చెపాక్ స్టేడియంలో మరికొద్దిసేపట్లో చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే, ఈ మ్యాచ్ను అడ్డుకుంటామని ఆందోళనకారులు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కొంతమంది ఆందోళనకారులు భద్రతా వలయాన్ని ఛేదించుకొని స్టేడియం స్టేడియం లోపలకు దూసుకొస్తున్నారు. దీంతో అక్కడ ప్రస్తుతం గందగోళ వాతావరణం నెలకొంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభంకానున్న నేపథ్యంలో మరోవైపు టికెట్ను కొనుగోలు చేసిన అభిమానులు చెపాక్ స్టేడియానికి చేరుకునేందుకు అవస్థలు పడుతున్నారు.
స్టేడియం దారులన్నీ తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. పాసులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే ప్రేక్షకులను లోపలికి అనుమతిస్తున్నారు. మ్యాచ్ను కావేరీ బోర్డుతో లింకుపెట్టి మ్యాచ్ను జరగనివ్వమని ఇప్పటికే స్పష్టం చేసిన కొన్ని రాజకీయ పార్టీల నేతలు, సంఘాల నాయకులు మైదానంలోకి వెళ్తున్న క్రికెట్ అభిమానులపై ఆందోళనకారులు దాడికి దిగారు.
దీంతో 400 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మ్యాచ్ నిర్వహణకు వ్యతిరేకంగా కొంతమంది నిరసనకారులు నలుపు రంగు బెలూన్లను కూడా గాల్లోకి విడుదల చేశారు. తాము మెయిన్ రోడ్లపైనే నిరసన తెలుపుతామని ప్రముఖ దర్శకుడు భారతీరాజాతో పాటు మరికొంత మంది హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో స్టేడియానికి వెళ్లే ప్రధాన రహదారి అన్న సలై రోడ్డులో దాదాపు 100 మంది నిరసనకారులు బైఠాయించారు. దీంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మ్యాచ్ను వీక్షించేందుకు స్టేడియానికి వచ్చే ప్రేక్షకులు తమవెంట మొబైల్ ఫోన్లు తెచ్చుకోవచ్చని ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.
చెపాక్ స్టేడియం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఆందోళన వ్యక్తం చేశారు. కావేరీ జలవివాదం పరిష్కారం అయ్యే వరకు చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్లు నిషేధించాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో చెన్నైలో చెన్నై మ్యాచ్లు సజావుగా జరిగేలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబాను మంగళవారం ఆయన కలిశారు.