హైదరాబాద్: ఐపీఎల్-11 సీజన్లో భాగంగా వేలంలో విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ను వదులుకోవడంపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు క్రిస్ గేల్ ఏడు సీజన్ల పాటు సేవలందించాడని. కానీ రాబోయే రోజుల్లో జట్టు అవసరాల దృష్ట్యా ఈ ఏడాది అతణ్ని జట్టులోకి తీసుకోలేదని ఆ జట్టు కెప్టెన్ విరాట్ తెలిపాడు.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈసారి ఐపీఎల్ వేలంలోఆటగాళ్లను ఎంపిక చేయడం జరిగిందని కోహ్లి స్పష్టం చేశాడు. అదే కారణంతో గేల్ను వదులుకున్నామని, అంతే తప్పా మరే కారణం లేదన్నాడు. ఈసారి ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లకు మరోసారి వేలం నిర్వహించగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ గేల్ను కొనుగోలు చేసింది.
'గత కొన్నేళ్లుగా గేల్ రాయల్ చాలెంజర్స్కు ఎంతో ఆడాడు. గేల్కు వయసుతో సంబంధం లేదు. కాకపోతే వచ్చే మూడేళ్లను దృష్టిలో పెట్టుకుని యాజమాన్యం ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అతనికి బదులు ఇద్దరు లేదా ముగ్గురు ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలనుకున్నాం.' అని కోహ్లి వివరించాడు.
'క్రిస్ గేల్ గొప్ప ఆటగాడు. గత కొన్నేళ్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అమూల్యమైన సేవలు అందించాడు. కొత్త కుర్రాళ్లను తీసుకోవడం వల్ల జట్టు సమతూకంగా ఉంది. గేల్ కాదని వేరే వాళ్లను తీసుకోవడం మా ఉద్దేశం కాదు. జట్టు కూర్పు గురించే ఈ నిర్ణయం తీసుకున్నాం. వచ్చే మూడేళ్లలో జట్టు నిలబడాలంటే ఇలాంటి మార్పులు తప్పదు' అని కోహ్లి జట్టు ఎంపికపై విశ్లేషించాడు.