హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఎడ్జిబాస్టన్ వేదికగా ఆదివారం భారత్, పాక్ జట్ల మధ్య జరిగిన హై ఓల్టేజ్ మ్యాచ్కి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా హాజరైన సంగతి తెలిసిందే. దేశంలోని పలు బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకొని, వాటికి ఎగనామం పెట్టి మాల్యా లండన్ పారిపోయిన సంగతి తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ ; ఫోటోలు ; స్కోరు కార్డు
ఈ క్రమంలో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్కి విజయ్ మాల్యా హాజరు కావడం జాతీయ మీడియాలో పెద్ద సెన్సేషన్ న్యూస్ అయింది. దేశం నుంచి పారిపోయిన మాల్యా దర్జా ఏమీ తగ్గలేదని పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. అయితే తాజా ప్రచారంపై విజయ్ మాల్యా ట్విట్టర్ వేదికగా స్పందించాడు.

ఎడ్జిబాస్టన్లో పాక్తో జరిగిన మ్యాచ్కు తాను రావడంపై మీడియా కవరేజి సెన్సేషనల్గా ఉందని, అయితే తాను మొత్తం అన్ని మ్యాచ్లకు వచ్చి భారత జట్టును అలరిస్తానని ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. తన తొలి మ్యాచ్లోనే పాకిస్థాన్ జట్టుపై ఘన విజయం సాధించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాల్యా ప్రశంసల్లో ముంచెత్తాడు.
వరల్డ్ క్లాస్ ప్లేయర్, వరల్డ్ క్లాస్ కెప్టెన్, వరల్డ్ క్లాస్ జెంటిల్మన్ అంటూ ప్రశంసించాడు. బ్రేవో విరాట్ అంటూ అభినందిస్తూ మరో ట్వీట్లో పొగడ్తలతో ముంచెత్తాడు. దేశంలోని పలు బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకొని, వాటికి ఎగనామం పెట్టడంతో విజయ్ మాల్యాపై ఆర్థిక అక్రమాల కేసు నమోదైన సంగతి తెలిసిందే.
ఈ కేసులలో విచారణ, అరెస్టు తప్పించుకోవడానికి అతను లండన్ పారిపోయాడు. ప్రస్తుతం లండన్లోనే తలదాచుకుంటున్నాడు. ఆర్ధిక నేరాల కేసు నమోదైన మాల్యాని భారత్కు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల అతన్ని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్టు చేయడం, ఆ తర్వాత వెంటనే బెయిల్పై విడుదలైన సంగతి తెలిసిందే.