హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జూన్ 1న ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోని టాప్ ఎనిమిది జట్లు ఈ టోర్నీలో రెండు గ్రూపులుగా విడిపోయి పాల్గొంటున్నాయి. జూన్ 1న ప్రారంభ మ్యాచ్ జరగుతుండగా, జూన్ 18న ఓవల్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రస్తుత ఛాంపియన్స్ లీగ్లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ సెమీ ఫైనలిస్ట్ జట్లను ఎంపిక చేశారు. నాకౌట్ స్టేజిలో టీమిండియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో పాటు ఆతిథ్య ఇంగ్లాండ్ జట్లకు చాపెల్ చోటు కల్పించాడు.
మొత్తం ఎనిమిది జట్లు పోటీ పడుతున్న ఈ టోర్నీలో గ్రూపు దశలో అగ్రస్థానంలో ఉన్న మొదటి రెండు జట్లు సెమీస్కు అర్హత సాధించనున్నాయి. ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోకి రాసుకొచ్చిన కథనంలో ఇయాన్ చాపెల్ ఈ నాలుగు జట్లను బలమైన జట్లుగా అభివర్ణించాడు.
'చరిత్రను ఒక్కసారి పరిశీలిస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, ఇండియా, దక్షిణాఫ్రికా జట్లే అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చాయి. ఈ 50 ఓవర్ల ఫార్మెట్లో ఈ నాలుగు జట్లదే ఆధిపత్యం' అని చాపెల్ వ్యాఖ్యానించాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో ఆడటం వల్లే కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా బాగా ప్రిపేర్ అయిందని చెప్పాడు.
'టీ20 గేమ్ అయిన ఐపీఎల్లో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఆటగాళ్లు ఆడటం వల్ల టోర్నీకి బాగా సన్నద్ధమయ్యారు. 50 ఓవర్ల ఫార్మెట్కు ఇది చక్కగా ఉపకరిస్తుంది. టీ20 ఫార్మెట్లో బ్యాట్స్మెన్లు పరుగుల కోసం చూస్తే, బౌలర్లు మాత్రం వికెట్ల తీసేందుకు పోటీపడతారు. ఈ మైండ్ సెట్ వన్డే గేమ్కి సరిపోతుంది' అని అన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తన తొలి మ్యాచ్లో భాగంగా దాయాది దేశమైన పాకిస్థాన్తో జూన్ 4వ తేదీన తలపడనుంది. ఈ టోర్నీలో భారత్ పై పాకిస్థాన్కు మెరుగైన రికార్డు ఉంది.