హైదరాబాద్: వరల్డ్కప్ విజయం తర్వాత క్యాన్సర్ ఉందని తెలియడం తన ఆనందాన్ని ఒక్క క్షణంలో చిదిమేసిందని టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. గతేడాది కాలంగా పేలవ ఫామ్ కారణంగా భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న యువీ... ప్రస్తుతం దేశవాళీ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నాడు.
విండిస్ 311 ఆలౌట్: షా హాఫ్ సెంచరీ, లంచ్ విరామానికి భారత్ 80/1
ఈ టోర్నీలోనూ ఇప్పటివరకు 7 మ్యాచ్లాడిన యువరాజ్ మొత్తం 264 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో యువరాజ్ మాట్లాడుతూ "వరల్డ్కప్ విజయం తర్వాత క్యాన్సర్ ఉందని తెలియడం నా ఆనందాన్ని ఒక్క క్షణంలో చిదిమేసింది. అవి నా జీవితంలో చీకటి రోజులు" అని యువరాజ్ అన్నాడు.
"నువ్వు వరల్డ్కప్ గెలిచినప్పుడు, నువ్వు మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికైనప్పుడు శిఖరాన్ని అధిరోహించినట్టు ఉంటుంది. కానీ, అకస్మాత్తుగా అగాథంలోకి పడిపోయా. జీవితం ఇంతే. ఏం జరుగుతుందో తెలియదు. మరో అవకాశమే ఇవ్వదు" అని యువరాజ్ తెలిపాడు. ప్రస్తుతం యువీ మంచి ఫిట్నెస్ సాధించాడు. యో-యో టెస్టు సైతం పాసయ్యాడు.
ఫిట్నెస్ సాధించడం కోసం ఇంగ్లాండ్ వెళ్లి ప్రాక్టీస్ చేశాడు. ప్రస్తుతం 2019 వరల్డ్కప్లో ఆడాలన్న తన లక్ష్యం కోసం కఠినంగా శ్రమిస్తున్నట్లు తెలిపాడు. 2011లో స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్లో యువరాజ్ సింగ్ అటు బంతితోనూ, ఇటు బ్యాట్తోనూ అద్భుత ప్రదర్శన చేశాడు.
ఈ టోర్నీలో మొత్తం 362 పరుగులు చేసిన యువరాజ్ 15 వికెట్లు తీశాడు. దీంతో యువీకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఓ క్రికెటర్గా తన జీవితంలో యువీకి అదొక అపురూపమైన క్షణం. టీమిండియా రెండోసారి వరల్డ్ కప్ నెగ్గిన ఆనంద క్షణాల్లో మిగతా క్రికెటర్లందరూ ఉంటే, యువీ మాత్రం క్యాన్సర్ బాధితుడయ్యాడు.
మూడేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం 2017లో టీమిండియాలోకి పునరాగమనం చేసిన యువీ ఇంగ్లాండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో 150 పరుగులతో సత్తాచాటాడు. దీంతో మళ్లీ అతడి కెరీర్ గాడిన పడిందని అంతా భావించారు. కానీ, ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ, వెస్టిండీస్ పర్యటనల్లో విఫలం కావడంతో జట్టులో చోటు కోల్పోయాడు.
మరోవైపు టీమిండియాలో చోటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే మిడిలార్డర్లో మనీశ్ పాండే, కేదార్ జాదవ్, కేఎల్ రాహుల్, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.