కివీస్తో మూడు టీ20ల సిరీస్లో భారత జట్టు నిర్ణయాత్మక మూడో మ్యాచ్ కోసం రెడీ అవుతోంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తొలి టీ20లో భారత బ్యాటర్లు విఫలం అవడంతో 21 పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. ఇక లక్నో వేదికగా జరిగిన రెండో మ్యాచులో భారత స్పిన్నర్లు చెలరేగారు. దీంతో కివీస్ జట్టు 99 పరుగుల స్కోరు మాత్రమే చేయగలిగింది. లక్ష్య ఛేదనలో టీమిండియా కూడా తడబడింది. చివర్లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా చలవతో విజయతీరాలకు చేరింది.
సిరీస్ డిసైడర్ మ్యాచ్ జరిగే అహ్మదాబాద్లో భారత జట్టుకు మంచి జ్ఞాపకాలే ఉన్నాయి. ఇక్కడ చివరగా భారత్ ఆడింది ఇంగ్లండ్తో. 2016లో జరిగిన ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో ఈ రెండు జట్లు 2-2తో నిలిచాయి. ఆ సిరీస్లో కూడా డిసైడర్ మ్యాచ్ అహ్మదాబాద్లోనే జరిగింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనర్లుగా వచ్చారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా కూడా రాణించారు. దీంతో ఆ మ్యాచ్లో టీమిండియా ఏకంగా 224 పరుగుల భారీ స్కోరు చేసింది.
లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ తొలి ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. అయితే జోస్ బట్లర్, డేవిడ్ మలన్ చెలరేగారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించి తమ జట్టుకు విజయం అందించేలా కనిపించారు. కానీ బట్లర్ను భువనేశ్వర్ అవుట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ తర్వాత మిగతా బౌలర్లు కూడా ఇంగ్లిష్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో 8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 188 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్ కూడా భారత్ వశమైంది. మరి ఈసారి కూడా ఆ హిస్టరీని టీమిండియా రిపీట్ చేస్తుందేమో చూడాలి.