ఆఖరి ఓవర్లో ఆసీస్ విజయానికి 14 పరుగులు
అయితే, ఆఖరి ఓవర్ వేసిన ఉమేశ్ యాదవ్ ఆస్ట్రేలియా విజయానికి కావాల్సిన 14 పరుగులు సమర్పించుకోవడంతో భారత్ ఓటమిపాలైంది. దీంతో తొలి టీ20లో టీమిండియా ఓటమికి ఉమేశ్ యాదవే కారణమంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న తరుణంలో బుమ్రా అతడికి మద్దతుగా నిలిచాడు. డెత్ ఓవర్లలో గెలుపు అవకాశాలు 50-50గా ఉంటాయని చెప్పాడు.
మ్యాచ్ అనంతరం బుమ్రా మాట్లాడుతూ
మ్యాచ్ అనంతరం బుమ్రా మాట్లాడుతూ "డెత్ ఓవర్లలో బౌలింగ్ చాలా కష్టం. గెలుపు అవకాశాలు 50-50గా ఉంటాయి" అని చెప్పాడు. "కొన్నిసార్లు మనకు అనుకూలంగా ఫలితం వస్తే, మరికొన్ని ఫలితం ప్రతికూలంగా ఉండవచ్చు. విజయం అంచుల వరకూ వచ్చి మ్యాచ్ను చేజార్చుకోవడం బాధకరమే అయినా, ఎవరూ కావాలని పరుగులు ఇవ్వరు కదా?" అని అన్నాడు.
15-20 పరుగులు వెనుకబడిపోయాం
"ఈ వికెట్పై తాము బ్యాటింగ్లో ఇంకా 15-20 పరుగులు వెనుకబడిపోయాం. కనీసం 140 నుంచి 145 పరుగులు చేసి మంచి టార్గెట్ను ఆసీస్కు నిర్దేశించే వాళ్లమే. తాము అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి యత్నించినప్పటికీ కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో స్కోరు మందగించింది. అదే తమ ఓటమిపై ప్రభావం చూపించింది" అని బుమ్రా పేర్కొన్నాడు.
టార్గెట్ తక్కువని తెలిస్తే పరిస్థితి వేరు
"టార్గెట్ తక్కువని తెలిసినప్పుడు బ్యాటింగ్ ఆడే తీరు భిన్నంగా ఉంటుంది. నెమ్మదిగా ఆడుతూ బౌండరీలపైనే దృష్టి సారిస్తారు. అవసర రిస్క్లు తీసుకోరు. అయితే, తొలుత బ్యాటింగ్ చేసేటప్పుడు మాత్రం మంచి స్కోరు చేయడం కోసం రిస్క్లు చేయాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్తో కేఎల్ రాహుల్ తిరిగి ఫామ్లో రావడం సంతోషంగా ఉంది" అని బుమ్రా తెలిపాడు.