ఫిట్గా లేకపోతే:
పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రెట్ లీ మాట్లాడుతూ.. టీమిండియా బౌలింగ్తో టోర్నీలో తిరిగి పుంజుకునే అవకాశం ఉందన్నాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయగలిగితే భారత జట్టు పటిష్ఠంగా మారినట్టే అని పేర్కొన్నాడు. ఒకవేళ అతను ఫిట్గా లేకపోతే మాత్రం టీమిండియా ఇతర అవకాశాలను పరిశీలించాలన్నాడు. అయితే మంచి ఆల్రౌండర్గా జట్టులో హార్దిక్ కీలక పాత్ర పోషిస్తాడని తాను నమ్ముతున్నట్లు లీ తెలిపాడు. 'హార్దిక్ పాండ్యాకు మంచి నైపుణ్యం ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ చేసే సామర్థ్యం ఉంది. డెత్ ఓవర్లలో చాలా బాగా బౌలింగ్ చేయగలడు. బౌన్సర్లు, యార్కర్లు, పేస్లో మార్పులు చూపించగలడు. అందుకే టీమిండియాకు హార్థిక్ అదనపు బలం' అని బ్రెట్ లీ అన్నాడు.
భువీ పొరపాట్లు చేశాడు:
'ఇరువైపులా స్వింగ్ చేయగల నైపుణ్యం భువనేశ్వర్ కుమార్ సొంతం. ప్రపంచంలోని చాలా మంది ఫాస్ట్ బౌలర్లు ఇన్, ఔట్ స్వింగర్లను వేయలేరు. యూఏఈ లాంటి పిచ్లపైనా చాలా ప్రభావం చూపగలడు. భువీ గంటకు దాదాపు 140కిలో మీటర్ల వేగంతో బంతులు విసురుతాడు. అయితే బౌలింగ్లో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుందని భావిస్తున్నా. పాకిస్థాన్తో మ్యాచ్లోనూ ప్రయత్నించాడు. ఈ క్రమంలో లెంగ్త్ విషయంలో కొన్ని పొరపాట్లు చేశాడు. వైవిధ్యంగా బంతులను సంధించే క్రమంలో లెంగ్త్ విషయాన్ని భువి మరిచిపోయాడు. మోకాలు కిందికి, లెంగ్త్లో వేయడంలో భువి దిట్ట. అలాంటి బంతులకు ఎల్బీడబ్ల్యూగా లేదా కీపర్ క్యాచ్లను రాబట్టగలడు' అని బ్రెట్ లీ పేర్కొన్నాడు.
మూడో ఫాస్ట్ బౌలర్ వద్దనుకుంటేనే:
మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నాణ్యమైన లెగ్ బ్రేక్ స్పిన్నర్ అని.. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా స్పెషలిస్ట్ బ్యాటర్, స్పిన్నర్ కాబట్టి సీనియర్ రవిచంద్రన్ అశ్విన్ వైపు జట్టు యాజమాన్యం మొగ్గు చూపడం కష్టమేనని బ్రెట్ లీ చెప్పాడు. ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో దిగే అవకాశాలు చాలా తక్కువని ఆసీస్ మాజీ పేసర్ అంచనా వేశాడు. మూడో ఫాస్ట్ బౌలర్ రాణించకపోతే అశ్విన్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉందని అంచనా వేశాడు. వచ్చే మ్యాచుల్లో టీమిండియా జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మొహ్మద్ షమీతో పాటు నాలుగో బౌలర్గా చక్రవర్తి, ఐదో బౌలర్గా జడేజాను ఎంచుకోవచ్చని బ్రెట్ లీ చెప్పుకొచ్చాడు.