భారత పేస్ బౌలింగ్ విభాగం ఇటీవలి కాలంలో బలంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఈ విభాగంలోనే సమస్య కూడా కనిపిస్తోంది. మన బౌలర్లు ఎవరూ ఎక్కువ వేగంగా బౌలింగ్ చెయ్యడం లేదు. అయితే టీమిండియా యువ పేసర్ అర్షదీప్ సింగ్ మాత్రం తనకున్న బలాలను చక్కగా ఉఫయోగించుకుంటూ పేస్ దళంలో కీలక సభ్యుడిగా మారాడు. ఈ క్రమంలోనే పేస్ బౌలింగ్ లెజెండ్ బ్రెట్లీ.. అర్షదీప్కు కొన్ని సలహాలు, సూచనలు చేశాడు.
టీ20 వరల్డ్ కప్లో టీమిండియా సెమీఫైనల్ వరకూ చేరుకోవడంలో అర్షదీప్ సింగ్ పాత్ర కూడా చాలా ఉంది. ఆసీస్ పరిస్థితులను చక్కగా ఉపయోగించుకున్న అతను.. ఈ టోర్నీలో పది వికెట్లు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే బ్రెట్లీ కొన్ని సూచనలు చేశాడు. అర్షదీప్ను జిమ్కు వెళ్లొద్దన్న బ్రెట్ లీ.. ఒక వేళ వెళ్లినా మరీ ఎక్కువగా బరువులు ఎత్తొద్దని సూచించాడు. మరీ బరువులు ఎత్తేసి కండలు పెంచితే బౌలింగ్ వేగం పెగదని, అలాగే ఎక్కువ కాలంపాటు వేగంగా బౌలింగ్ చెయ్యలేమని వివరించాడు.
కొన్ని రోజుల క్రితం ఆసియా కప్లో పాకిస్తాన్ బ్యాటర్ ఆసిఫ్ అలీ ఇచ్చిన సులభమైన క్యాచ్ను అర్షదీప్ సింగ్ జారవిడిచాడు. దీంతో అతనిపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరిగింది. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ముఖ్యంగా అర్షదీప్పై విద్వేష వ్యాఖ్యలు చేసిన చాలా ఖాతాలు పాకిస్తాన్కు చెందినవి కావడంతో ఈ విషయం మరిన్ని చర్చలకు దారితీసింది.
ఇదే విషయాన్ని గుర్తుచేసిన బ్రెట్ లీ.. సోషల్ మీడియాకు సాధ్యమైనంత దూరంగా ఉండాలని అర్షదీప్కు సలహా ఇచ్చాడు. ఒకవేళ అది సాధ్యం కాదని అనుకుంటే మన బుర్రలోనే ఒక సెన్సార్ బోర్డు వంటిది పెట్టుకొని, సోషల్ మీడియా పోస్టులను పట్టించుకోకూడదని చెప్పాడు. సోషల్ మీడియాలో ఉన్న చెత్తనంతా చూడొద్దని, కేవలం అవసరమైనంత వరకే చూసేలా బుర్రనె ట్రెయిన్ చేసుకోవాలని సూచించాడు.