ముంబై: గాయం కారణంగా దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్కి దూరమైన భారత యువ పేస్ బౌలర్, యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా చికిత్స అనంతరం ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ సందర్భంగా బుధవారం బుమ్రా తన క్రికెట్ ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నాడు. చిన్నతనంలో ట్రోఫీని అందుకున్న ఫొటోని, ఇటీవల ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ను గెలుచుకున్న ఫొటోని పోలుస్తూ తన ట్విటర్లో పోస్ట్ చేశాడు.
'ఆ స్థాయి నుంచి మొదలై.. ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నా' అని బుమ్రా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై అభిమానులు భారీగా స్పందిస్తున్నారు. బుమ్రాని కొనియాడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'బౌలింగ్ విభాగంలో అసలైన రారాజువి'.. 'సాధారణ స్థాయి నుంచి వచ్చి అద్భుత ప్రదర్శన చేస్తున్నావ్'.. 'ఎంతో మంది క్రీడాకారులకు నువ్వు స్ఫూర్తి'.. 'గాయం నుంచి తొందరగా కోలుకోవాలి' అని కామెంట్లు చేస్తున్నారు.
Started from the bottom now we're here. 🦁🔥 pic.twitter.com/4Sv1wtoFxE
— Jasprit Bumrah (@Jaspritbumrah93) October 16, 2019
బుమ్రా 2016 జనవరిలో భారత్ తరపున టీ20లో అరంగ్రేటం చేసాడు. అదే సంవత్సరం ఆగష్టు నెలలో వన్డేల్లోకి వచ్చాడు. గత ఏడాదే టెస్టు క్రికెట్ను ఆరంభించాడు. బుమ్రా భారత్ తరఫున 12 టెస్టులు, 58 వన్డేలు, 42 టీ20లు ఆడాడు. టెస్టులలో 62, వన్డేల్లో 103, టీ20లో 51 వికెట్లు తీశారు. ప్రస్తుతం ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో 818 రేంటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
గత నెల చివర్లో క్రికెటర్లకి నార్మల్ రేడియాలజీ టెస్టులని నిర్వహించారు. ఈ పరీక్షల్లో బుమ్రా వెన్ను భాగంలో చిన్న చీలిక ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో దక్షిణాఫ్రికా సిరీస్ నుంచి బుమ్రాని తప్పించిన భారత సెలక్టర్లు.. అతని స్థానంలో మరో ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ని ఎంపిక చేశారు. ఫాస్ట్ బౌలర్ కావడంతో మళ్లీ ఆ గాయం తిరగబడే ప్రమాదం ఉన్నందున మెరుగైన వైద్యం కోసం బుమ్రాని బ్రిటన్కి పంపి చికిత్స అందించారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు.