

హైదరాబాద్: కేరళలో ఉంటే ఆ ఆనందం అంతా ఇంతా కాదని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. కేరళ రావడానికి తానెప్పుడూ ఇష్టపడతానని, ఈ ప్రాంతానికి వస్తే ఎనర్జీతో పాటు ఎంతో ఆనందం కలుగుతుందని విరాట్ కోహ్లీ తెలిపాడు. ఐదు వన్డేల సిరిస్లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య ఆఖరి వన్డే తిరువనంతపురం ఆతిథ్యమివ్వనుంది.
ఇందులో భాగంగా ఇరు జట్లు ఇప్పటికే తిరువనంతపురానికి చేరకున్నాయి. విమానాశ్రయం నుంచి హోటల్కు చేరుకున్న విరాట్ కోహ్లీ అక్కడి విజిటర్స్ డైరీలో కేరళ గురించి నోట్ రాశాడు. వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన దేవుని సొంత దేశం(కేరళ) మళ్లీ పూర్తిగా కోలుకుందని పేర్కొన్నాడు.
"కేరళలో ఉంటే ఆ ఆనందమే వేరు. ఇక్కడికి రావడం నాకెంతో ఇష్టం. ఈ ప్రాంత ఎనర్జీని చాలా ఇష్టపడతాను. కేరళ అందం ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. అందరూ కేరళకు వచ్చి ఈ దేవుని సొంత దేశం అనుభూతిని ఆస్వాదించాలని సూచిస్తున్నాను. కేరళ పూర్తిగా కోలుకుంది. ఇప్పుడు ఎంతో సురక్షితంగా ఉంది. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఎంతో ఆనందాన్ని పంచుతున్న ఈ అద్భుత ప్రాంతానికి కృతజ్ఞతలు" అని కోహ్లీ రాశాడు.
కెప్టెన్ కోహ్లీ రాసిన ఈ నోట్ను కేరళ టూరిజం శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ ట్విట్టర్ ద్వారా అటు క్రికెట్ అభిమానులతో పాటు ప్రజలతో పంచుకున్నారు. కేరళపై ఇంత ప్రేమ కురిపించిన విరాట్ కోహ్లీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
"మీరు ఇక్కడికి వచ్చినప్పుడల్లా కేరళ మీకు ఆనందం పంచుతోందని తెలిసి మేం చాలా సంతోషించాం. మా ఆతిథ్యాన్ని ఎంజాయ్ చేయండి. రేపటి మ్యాచ్లో విజయం సాధించాలని కోరుకుంటున్నా" అని సురేంద్రన్ తన ట్వీట్లో పేర్కొన్నారు.