టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ఘోరంగా ఓడిపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కొందరు సీనియర్ ప్లేయర్ల ఆటతీరును అభిమానులు ఎండగట్టారు. ఫిట్నెస్, ఆటతీరు, ఇంటెంట్ ఏవీ లేవంటూ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే బీసీసీఐ కఠిన నిర్ణయాలు తీసుకోవాలని డిసైడ్ అయింది. అందుకే ఇక నుంచి టీ20 ఫార్మాట్లో సీనియర్ ఆటగాళ్లను ఎంపిక చేయకూడదని అనుకుంటోందట.
వచ్చే ఏడాది రెండు ఐసీసీ టోర్నమెంట్లు ఉన్నాయి. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్తోపాటు వన్డే వరల్డ్ కప్ కూడా జట్టుకు కీలకం కానుంది. అందుకే ఈ ఫార్మాట్లపై బీసీసీఐ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది భారత జట్టు వన్డేలు, టెస్టులే ఎక్కువగా ఆడనుంది. ఇదే విషయాన్ని బీసీసీఐ ప్రతినిధులు కూడా చెప్తున్నారు. ఇక నుంచి పొట్టి ఫార్మాట్లో యువ ఆటగాళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తామని, బలమైన బెంచ్ సామర్ధ్యం వల్ల వాళ్లు కూడా తప్పనిసరిగా రాణించాల్సిన పరిస్థితి క్రియేట్ చేస్తామని అంటున్నారు.
జట్టులో ఇలా సమూలమైన మార్పులు చేసే యోచనతోనే న్యూజిల్యాండ్తో సిరీస్కు రవిచంద్రన్ అశ్విన్, దినేష్ కార్తీక్ వంటి ఆటగాళ్లను బీసీసీఐ ఎంపిక చెయ్యలేదు. ఒక విధంగా వాళ్లు మళ్లీ భారత జట్టుకు ఆడటం అసాధ్యంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పొట్టి ఫార్మాట్కు కొత్త కెప్టెన్ను కూడా ఎంపిక చేసి, అతనితోపాటు యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది.
దీని గురించి బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. 'ఎవర్ని రిటైర్ అవ్వమని మేం అడగం. వాళ్లు రిటైర్ అవ్వాలా? లేదా? అనేది ఆటగాళ్ల వ్యక్తిగత నిర్ణయం. కానీ వచ్చే ఏడాదిలో చాలా తక్కువ టీ20 మ్యాచులు ఉన్నాయి. వాటిలో చాలా మంది సీనియర్ ఆటగాళ్లు కనిపించరు. వాళ్లంతా వన్డేలు, టెస్టులపై ఫోకస్ పెడతారు. వచ్చే ఏడాది మాత్రం టీ20ల్లో చాలా మంది సీనియర్లు ఆడరు' అని స్పష్టం చేశారు. మరి టీ20 వరల్డ్ కప్లో రాణించిన కోహ్లీ వంటి ఆటగాళ్ల పరిస్థితి ఏంటో చూడాలి.