అందుకే టెస్ట్ టీమ్లోకి సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్: బీసీసీఐ

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై జరిగే 'బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ'లోని తొలి రెండు టెస్టుల కోసం భారత జట్టును సెలక్టర్లు ప్రకటించారు. 17 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను శుక్రవారం చేతన్ శర్మ నేతృత్వంలోని ఆలిండియా సెలెక్షన్ కమిటీ వెల్లడించింది.
టీ20లో తన విధ్వంసకర ఆటతో చెలరేగుతున్న సూర్యకుమార్ యాదవ్ తొలిసారి టెస్టు టీమ్లోకి ఎంపికయ్యాడు. ఇప్పటి వరకు టెస్టుల్లో అవకాశం రాకపోయినా ఫస్ట్క్లాస్ క్రికెట్లోనూ సూర్యకు మంచి రికార్డే ఉంది. 79 మ్యాచ్ల్లో అతను 44.75 సగటుతో 5549 పరుగులు చేయగా, ఇందులో 14 సెంచరీలు ఉన్నాయి.
ఇషాన్కు పిలుపు..
మరోవైపు కారు ప్రమాదానికి గురైన వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయ వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ను ఎంపిక చేశారు. ఆంధ్ర ఆటగాడు కోన శ్రీకర్ (కేఎస్) భరత్ ఇప్పటికే టెస్టు టీమ్తో ఉండగా.. కిషన్కు టెస్టుల్లో ఇదే తొలి అవకాశం. బుమ్రాను ఎంపిక చేయకపోవడంతో అతను పూర్తిగా కోలుకోలేదని తేలింది. గాయం నుంచి కోలుకుంటున్న రవీంద్ర జడేజానూ జట్టులోకి తీసుకున్నా... ఫిట్నెస్ నిరూపించుకుంటేనే ఆడుతాడు.

అటాకింగ్ ఆప్షన్ కోసమే..
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్(డబ్ల్యూటీసీ)లో భాగంగా భారత్కు ఇదే చివరి సిరీస్ కావడంతో బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సిరీస్లో భారత్ నెగ్గితేనే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరనుంది. అయితే బ్యాటింగ్ అటాకింగ్ కోసమే సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్లను టెస్ట్ టీమ్లోకి తీసుకున్నామని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. స్పిన్ బౌలింగ్ను సూర్య సమర్థవంతంగా ఆడగలడనే ఎంపిక చేశామని ఓ బీసీసీఐ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు.

ఇషాన్ కిషనే కీపర్..
'అటాకింగ్ ఆప్షన్ కోసమే సూర్యకుమార్ యాదవ్ను టెస్ట్ టీమ్లోకి తీసుకున్నాం. అంతేకాకుండా ఈ సిరీస్లో టీమిండియా టర్నింగ్ వికెట్లపై ఆడే అవకాశం ఉంది. దాంతోనే వేగంగా పరుగులు చేసే బ్యాటర్ను టీమ్మేనేజ్మెంట్ కావాలనుకుంది.'అని చెప్పుకొచ్చాడు. రిషభ్ పంత్కు రిప్లేస్మెంట్గా జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్..కేఎస్ భరత్ను వెనక్కు నెట్టి తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. పంత్లా హిట్టింగ్ చేయగలడనే ఇషాన్ను తీసుకున్నట్లు సదరు బీసీసీఐ అధికారి వెల్లడించాడు. అయితే ఓపెనర్గా ఆడే ఇషాన్ కిషన్.. ఈ సిరీస్లో పంత్లా మిడిలార్డర్లో ఆడనున్నాడని చెప్పాడు.

అదొక్కటే సమస్య..
'టాప్-6లో కేఎస్ భరత్ ఆడలేని పరిస్థితి. భరత్ను ఆడిస్తే టీమ్ ఓ బౌలర్ను త్యాగం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇషాన్ కిషన్ను ఆడిస్తే టాప్-6లో బ్యాటింగ్కు పంపించవచ్చు. కానీ టెస్ట్ ఫార్మాట్లో ఇషాన్ కిషన్కు కీపింగ్ చేసిన అనుభవం లేదు. అదే సమస్యగా మారింది. రంజీ ట్రోఫీలో జార్ఖండ్ తరఫున ఇషాన్ ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ కీపింగ్ చేయలేదు'అని సదరు అధికారి గుర్తు చేశాడు. భారత్, ఆ్రస్టేలియా మధ్య ఫిబ్రవరి 9నుంచి నాగపూర్లో తొలి టెస్టు జరుగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications