ధోనీ కథ ముగిసినట్టే..
ఇక ఆటకు దూరమైన ధోనీ .. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవడంతో అతని కెరీర్ ముగిసినట్టేననే అభిప్రాయం వ్యక్తమైంది. చాలా మంది మాజీ క్రికెటర్లు సైతం ఇక ధోనీ అంతర్జాతీయ రీ ఎంట్రీ కష్టమేనని.. ఓ వీడ్కోలు మ్యాచ్తో ఆటకు గుడ్బై చెబుతాడని కూడా తెలిపారు.
ఇటీవల సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న ఎమ్మెస్కే ప్రసాద్ కూడా ధోనీ భవతవ్యంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘ధోనీ తన భవిష్యత్పై పూర్తి స్పష్టతతో ఉన్నాడు. ఈ మేరకు టీమిండియా మేనేజ్మెంట్, నాతో అతను చర్చించి.. తన భవిష్యత్ నిర్ణయాలు చెప్పాడు. ఆ విషయాలన్నీ రహస్యం.. ఇప్పుడు ఇక్కడ చెప్పలేను. కానీ.. ఒక్కటి మాత్రం చెప్పగలను.. ధోనీతో ఆ చర్చలు మాత్రం చాలా అత్యుత్తమైనవి' అని ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు.
ఇక 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ధోనీ రిటైర్మెంట్ ప్రకటించేస్తాడనే ప్రచారం జరిగింది. కానీ.. ధోనీ మాత్రం మౌనంగానే ఉండిపోయాడు. తొలుత ఆర్మీ అంటూ.. ఆ తర్వాత జనవరి వరకు క్రికెట్ గురించి అడగవద్దని సూచించాడు. తన చుట్టు ఇంత జరుగుతున్న ఏనాడు ధోనీ నోరు విప్పలేదు.
ధోనీ గురించి చర్చే జరగలేదు.
ఇక తాజాగా సునీల్ జోషీ నేతృత్వంలో కొలువు దీరిన నయా సెలెక్షన్ కమిటీ సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు ఆదివారం జట్టును ప్రకటించింది. అయితే ఈ టీమ్ సెలెక్షన్ సమావేశంలో ధోనీ ప్రస్తావనే రాలేదని, కనీసం అతని పేరును కూడా పరిశీలించలేదని బీసీసీఐ వర్గాల మేరకు తెలుస్తోంది.
‘ఇది సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ ఎంపిక కోసం జరిగిన సాధారణ సమావేశం. ఇందులో ధోనీ ప్రస్తావనే రాలేదు. అతని భవిష్యత్తు గురించి కూడా ఎలాంటి చర్చ జరగలేదు.'అని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.
ఐపీఎలే నిర్ణయిస్తుంది..
ధోనీ భవిష్యత్తు ఐపీఎల్ పైనే ఆధారపడుతుందని సదరు అధికారి స్పష్టం చేశారు. ‘ఐపీఎల్ చెలరేగితే అతను భారత జట్టులోకి పునరాగమనం చేయగలడు. అతనొక్కడే కాదు.. చాలా మంది సీనియర్, జూనియర్ ఆటగాళ్లు ఐపీఎల్లో చెలరేగితే భారత జట్టులో చోటు దక్కుతుంది. టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో వారి పేర్లను పరిశీలిస్తారు. కాబట్టి జట్టులో కొన్ని ఆశ్చర్యకరమైన చేరికలు చూడవచ్చు. టీ20 ప్రపంచకప్ ముందు కొన్ని సిరీస్లు ఆడాల్సి ఉన్నా.. ఐపీఎల్ పెర్ఫామెన్స్ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది'అని సదరు అధికారి చెప్పుకొచ్చారు. సౌతాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్ మార్చి 12న ప్రారంభం కానుంది.