ఎంపిక వాయిదా:
బీసీసీఐ కార్యదర్శి ఇప్పటివరకు సెలక్షన్ కమిటీ కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. జట్టు ఎంపిక వివరాలు కూడా ఆయన పేరిటే విడుదలయ్యేవి. అయితే బీసీసీఐ కొత్త రాజ్యాంగం ప్రకారం కార్యదర్శిని ఈ బాధ్యత నుంచి తప్పించారు. సెలక్షన్ కమిటీ ఛైర్మనే కన్వీనర్గా ఉంటారు. బీసీసీఐ కొత్త రాజ్యాంగం ప్రకారం కార్యదర్శి స్థానాన్ని సెలెక్షన్ కమిటీ చైర్మన్ భర్తీ చేస్తాడని క్రికెట్ పరిపాలన కమిటీ (సీవోఏ) గురువారం పేర్కొంది. దీంతో సెలెక్షన్ కమిటీ సమావేశాలకు కార్యదర్శి హాజరు కానవసరం లేదు. అదే సమయంలో ఆటగాళ్లను భర్తీ చేయడంలో కూడా కార్యదర్శి అనుమతి అవసరం లేదు. కొత్త రాజ్యాంగం ప్రకారం నిబంధనలు అనుసరించడానికి కొంత సమయం పడుతుంది. మరోవైపు విజయ్ శంకర్, శిఖర్ ధావన్ల ఫిట్నెస్ నివేదికలు కూడా ఇంకా బోర్డు అందలేదు. దాంతో జట్టు ఎంపికను ఆదివారానికి వాయిదా వేశారు.
ధోనీపై చర్చ:
విండీస్ పర్యటనలో సెలెక్టర్లు ఎలాంటి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎంఎస్ ధోనీ విషయంపై సెలక్టర్ల సమావేశంలో ఎక్కువ చర్చ జరిగే అవకాశం ఉంది. అతడిని కొనసాగిస్తారా? వీడ్కోలు తీసుకోవాలని చెప్తారా? లేదా తాత్కాలికంగా విశ్రాంతి ఇస్తారా? మార్గనిర్దేశకుడిగా కొనసాగిస్తారా? అనే సందేహాలకు సమాధానం దొరుకుతుంది. టీమిండియా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రిషభ్ పంత్ను రెగ్యులర్ కీపర్గా ఎంపిక చేస్తారా అన్నది తేలనుంది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరగనుంది కాబట్టి ధోనీ వారసుడిగా పంత్ను ఎంపిక చేయడం లాంఛనమే.
కోహ్లీ అనుమానమే:
విండీస్ పర్యటనకు కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉంటాడా అన్నది అనుమానమే. ఆదివారం దీనిపై స్పష్టత రానుంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ప్రారంభం అవుతుండటంతో రెండు టెస్టుల్లో విరాట్ను ఆడించే అవకాశం ఉంది. నాకు విశ్రాంతి అవసరం లేదు అని కోహ్లీ అన్నాడు కాబట్టి సెలెక్టర్లు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతిని ఇవ్వొచ్చు. టీమిండియా ఈ సీజన్లో సొంతగడ్డపై ఎక్కువ క్రికెట్ ఆడనుంది కాబట్టి పరిమిత ఓవర్ల క్రికెట్ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించే అవకాశం ఉంది.
యువతకు అవకాశం:
మిడిలార్డర్లో దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్కు దాదాపుగా దారులు మూసుకుపోయినట్టే. దీంతో మయాంక్ అగర్వాల్, మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్ను సెలక్షన్ కమిటీ పరీశీలించనుంది. శుభ్మన్ గిల్, పృథ్వీ షా పైనా సెలక్టర్లు దృష్టి సారించనున్నారు. పేసర్లు నవదీప్ సైనీ, పేసర్ ఖలీల్ అహ్మద్లకు అవకాశం రావొచ్చు. స్పిన్నర్ రాహుల్ చాహర్కు అవకాశం దక్కినా ఆశ్చర్యం లేదు.