మ్యాచ్కు ఒకరోజు ముందే 12 మందితో జట్టు ప్రకటన
ఐదు వన్డేల సిరిస్లో ఇప్పటికే తొలి వన్డే గెలిచి ఉత్సాహంగా ఉన్న టీమిండియా అచ్చొచ్చిన వైజాగ్ స్టేడియంలో మరో విజయాన్ని నమోదు చేయాలని ఊవిళ్లూరుతోంది. ఇటీవల కాలంలో మ్యాచ్కు ఒక రోజు ముందే 12 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించే కొత్త సంప్రదాయానికి తెరలేపిన బీసీసీఐ రెండో వన్డేకి ముందు కూడా జట్టుని ప్రకటించింది.
టీమిండియాకు 950వ వన్డే
ఇదిలా ఉంటే బుధవారం టీమిండియా ఆడుతున్న వన్డే 950వ వన్డే కావడం విశేషం. ఈ మైలురాయిని అందుకోనున్న తొలి జట్టుగా భారత జట్టు రికార్డు సృష్టించనుంది. విశాఖ స్టేడియంలో భారత్ ఇప్పటివరకు మొత్తం 8 వన్డేలాడింది. అందులో ఒక మ్యాచ్ ఓడింది. ఆ ఓటమి వెస్టిండీస్ చేతిలోనే కావడం గమనార్హం. విశాఖలో భారత్ అత్యధికంగా విండీస్తోనే మూడు మ్యాచ్లు ఆడింది. అందులో ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. మిగతా రెండు మ్యాచ్ల్లో తలొకటి గెలిచాయి. 2013లో ఆ జట్టుతో హోరాహోరీగా సాగిన మ్యాచ్లో భారత్ 2 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మిగతా మ్యాచ్లన్నింట్లో భారత్ గెలిచింది.
విశాఖ పిచ్ బ్యాటింగ్కు అనుకూలం
రెండో వన్డే కోసం పిచ్ దాదాపుగా సిద్ధమైంది. పిచ్పై పగుళ్లు ఏర్పడకుండా సోమవారం రోలింగ్ చేశారు. విశాఖ పిచ్ ఎప్పట్లాగే బ్యాటింగ్కు అనుకూలంగా ఉండొచ్చని అంటున్నారు. రాత్రి ఏడు గంటల నుంచి మంచు పడుతుండడంతో టాస్ కూడా కీలకం కానుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. గత రెండు రోజులుగా ఎండలు బాగా కాస్తున్నాయి. మ్యాచ్ రోజు వర్షం పడే అవకాశాలు తక్కువే. ఒకవేళ బుధవారం వర్షం కురిసినా మ్యాచ్కు ఇబ్బందులు తలెత్తకుండా మైదాన సిబ్బంది అంతా సిద్ధం చేశారు.
|
టీమిండియా:
విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అంబటి రాయుడు, రిషభ్ పంత్, ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమీ, ఖలీల్ అహ్మద్