ముంబై: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రీడాలోకం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా నిరవధిక వాయిదా పడింది. కరోనా వ్యాప్తి కారణంగా దేశంలో లాక్డౌన్ విధించడంతో మార్చి నెల రెండో వారం నుంచే భారత క్రికెటర్లు ఆటకి దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా లాక్డౌన్ నిబంధనల్ని కేంద్ర ప్రభుత్వం సడలించడంతో మళ్లీ భారత క్రికెటర్లు స్టేడియంలోకి అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
లాక్డౌన్ తర్వాత.. ధోనీ ఏం ప్లాన్ చేసాడో తెలుసా?!!
ఏదైనా సిరీస్కి ముందు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో టీమిండియా ఆటగాళ్లకి క్యాంప్ని నిర్వహిస్తుంటారు. అయితే ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనల్ని కేంద్ర ప్రభుత్వం సడలించినా.. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ప్రయాణ ఆంక్షలు సడలించలేదు. దీంతో భారత ఆటగాళ్లు ఒక్కచోట క్యాంప్కి హాజరయ్యే అవకాశం లేకుండా పోయింది. అయినప్పటికీ అందుబాటులో ఉన్న స్టేడియాల్లో జూన్ మూడో వారం నుంచి టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తారని బీసీసీఐ కోశాధికారి అరుణ్ దుమాల్ వెల్లడించాడు.
తాజాగా అరుణ్ దుమాల్ మాట్లాడుతూ... 'క్రీడను తిరిగి ప్రారంభించడానికి బోర్డు అన్నిప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మార్గదర్శకాలను ఎన్సీఏ అధ్యయనం చేస్తోంది. వేదికలు, ప్రయాణం వంటి అన్ని విషయాలను మేము చర్చిస్తున్నాం. ఒకే వేదికకు ఆటగాళ్లను పంపేందుకు 100% ప్రయత్నిస్తున్నాం. ప్రాక్టీస్ చేయడానికి షార్ట్లిస్ట్ చేసిన వేదికలో ఎన్సీఏ ఒకటి. మిగిలిన వేదికలను త్వరలోనే చెపుతాం. అన్ని కుదిరితే జూన్ 15 తర్వాత ఒక శిబిరం సాధ్యమవుతుందని మేము ఆశిస్తున్నాం' అని అన్నాడు.
ఈ నెల చివర్లో ఐసోలేషన్ క్యాంప్ విషయంలోనూ బీసీసీఐ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. 'ఆటగాళ్లు అందరూ తిరిగి శిక్షణ ప్రారంభించడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. ఫ్లాట్లు, అపార్టుమెంటులలో ఉంటున్న వారికి శిక్షణ ఇవ్వడం చాలా కష్టం. కొందరు ఇంట్లోనే వ్యాయామాలు చేస్తున్నారు. అందరూ ఇప్పుడు మైదానంలో ఆడటానికి ఎదురు చూస్తున్నారు. ఈ నెల చివర్లో ఐసోలేషన్ క్యాంప్ విషయంలోనూ బీసీసీఐ కసరత్తులు చేస్తుంది' అని అరుణ్ తెలిపాడు.
ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. కరోనా వైరస్ కారణంగా ఆ టోర్నీని ఐసీసీ వాయిదా వేయాలని యోచిస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియా కూడా ఖాళీ స్టేడియాల్లో మ్యాచులు నిర్వహించేందుకు సిద్ధంగా లేదు. దీంతో టోర్నీ వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే అక్టోబరు-నవంబరు విండోలో ఐపీఎల్ 2020 సీజన్ని నిర్వహించాలని బీసీసీఐ చూస్తోంది.