బోర్డు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ
ఈ విషయంపై బోర్డు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ "ఇప్పటికే శాస్త్రి, కోహ్లీ కాంబినేషన్ మంచి ఫలితాలను రాబట్టింది. విజయాలతో దూసుకుపోతున్న ఈ కాంబినేషన్ను మార్చడం అంత మంచిది కాదు' అని తెలిపారు. కోచ్ని మార్చడం కంటే కొనసాగింపు నిర్ణయమే మంచిదనిపిస్తోందని ఆయన వెల్లడించారు.
కోచ్ మార్పు ప్రభావం
"ప్రస్తుతం జట్టులో ఉన్న సమీకరణం... ఆటగాళ్ల మానసిక స్థితిపై కోచ్ మార్పు ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఈ స్థితిలో కోచ్ మార్పు తప్పనిసరి అని భావిస్తే... రాబోయే ఐదు సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నిర్ణయం సముచితమైనదిగా అనిపించడం లేదు" అని బోర్డు ఉన్నతాధికారి అన్నారు.
కోహ్లీ, ఆటగాళ్లతో రవిశాస్త్రికి మంచి సంబంధాలు
ఇదిలా ఉంటే, కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆటగాళ్లతో రవిశాస్త్రికి మంచి సంబంధాలు ఉన్నాయి. అనిల్ కుంబ్లే అనంతరం 2017లో హెడ్ కోచ్గా రవిశాస్త్రి ఎంపికయ్యాడు. రవిశాస్త్రి హయాంలో భారత్ మంచి విజయాలు కూడా అందుకుంది. మరోవైపు బీసీసీఐ మద్దుతు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
కొత్తగా వయసుతో పాటు అనుభవాన్ని కొలమానంగా
కాగా, ఈ సారి కొత్తగా వయసుతో పాటు అనుభవాన్ని కొలమానంగా తీసుకోవాలంటూ ఐసీసీ కొత్త నిబంధనలను విధించింది. కోచ్ పదవి అభ్యర్థులకు కనీసం రెండేళ్ల అంతర్జాతీయ అనుభవంతో పాటు వయసు 60 ఏళ్లకు మించరాదని అందులో పేర్కొంది. ఆసక్తి కలిగిన అభ్యర్దులు జులై 30, సాయంత్రం ఐదు గంటల్లోగా దరఖాస్తులు అందజేయాలని బీసీసీఐ పేర్కొంది.
కొత్త కోచ్ ఎంపిక బాధ్యత కపిల్ కమిటీకే
కొత్త కోచ్ని మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ నాయకత్వంలోని క్రికెట్ అడ్వైజయిరీ కమిటీ ఎంపిక చేయనుంది. టీమిండియా హెడ్ కోచ్ రేసులో శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం మహేళా జయవర్దనేతో పాటు దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం గ్యారీ కిరెస్టన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీలు కూడా ఉన్నట్లు సమాచారం.