1000 కోట్ల ఫైన్ వేయాలి:
కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్ 2021ను నిర్వహించడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బీసీసీఐకి రూ.1000 కోట్ల ఫైన్ వేయాలని పిటీషన్లో కోరారు. అలాగే ఐపీఎల్ 2021 ద్వారా వచ్చే లాభాలను కరోనా చికిత్సకు అవసరమైన ఔషధాలు, మెడికల్ ఆక్సిజన్ సరఫరా కోసం ఉపయోగించేలా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని వారు కోరారు. ఇక డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జిఎస్ కులకర్ణి గురువారం ఈ విషయాన్ని విచారించడానికి అంగీకరించారు. మరి బాంబే హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
నిరవధికంగా వాయిదా:
ఐపీఎల్లోని పలు జట్ల ఆటగాళ్లు కరోనా వైరస్ బారిన పడుతుండటంతో బీసీసీఐ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ను ఐపీఎల్ మ్యాచ్లను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల ప్రకటించారు. ఆటగాళ్ల కరోనా బారిన పడుతుండటంతో తాజా పరిస్థితులపై చర్చించేందుకు ఐపీఎల్, బీసీసీఐ అత్యవసర సమావేశాన్ని నిర్వహించాయి. ఈ భేటీలో ఐపీఎల్ 2021ను నిరవధికంగా వాయిదా వేయాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది భద్రత విషయంలో బీసీసీఐ రాజీపడదని.. అందరి క్షేమం దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.
పలువురు ఆటగాళ్లకు కరోనా:
రెండు రోజులుగా ఐపీఎల్లోని పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు. సన్రైజర్స్ హైదరాబాద్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు కరోనా నిర్ధారణ కావడంతో ఆ జట్టు ఆటగాళ్లు ఐసోలేషన్లోకి వెళ్లారు. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా కరోనా బారినపడ్డాడు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లకు మరోసారి వైరస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఢిల్లీ మైదానంలో సిబ్బందిలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. కోల్కతా ఆటగాళ్లు వరణ్ చక్రవర్తి, సందీప్ వారియర్లకు ఆదివారం చేసిన పరీక్షల్లో కరోనా నిర్ధరణ అయింది. బయో బబుల్లో కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ ఆటగాళ్లు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ తాజా సీజన్ను నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.