ఆదివారం రాత్రి 12.45 సమయంలో
అయితే, ఆదివారం రాత్రి 12.45 సమయంలో సీన్ మొత్తం మారిపోయింది. ఈ రెండు గంటల సమయంలో ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య చోటు చేసుకున్న ఫోన్ సంభాషణ గంగూలీని అధ్యక్షుడిగా ఎన్నికయ్యేలా చేసింది. ఢిల్లీలోని ఓ కేంద్ర మంత్రితో పాటు ఆ సమయంలో ముంబైలో ఉన్న అస్సాం ఆర్థిక మంత్రి హిమంత బిస్వా శర్మ, మరో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మధ్య జరిగిన ఫోన్ కాల్ గంగూలీకి అనుకూలంగా మారేలా చేసింది.
ఆ ఎనిమిది ఓట్లే కీలకం
ముఖ్యంగా నార్త్ ఈస్ట్రన్ క్రికెట్ డెవలప్మెంట్ కమిటీలో ఉన్న ఎనిమిది ఓట్లు గంగూలీ ఎన్నికలో కీలకంగా వ్యవహారించాయి. నిజానికి బీసీసీఐలో తన పట్టు కొనసాగించాలని బలంగా ప్రయత్నించిన మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ ఎందుకు వెనక్కి తగ్గడంలో ఈ ఓట్లు ప్రధాన పాత్ర పోషించాయి. అప్పటి వరకు అధ్యక్ష పోటీలో ఉన్న బ్రిజేశ్ పటేల్ బరిలో నుంచి తప్పుకొని గంగూలీకి దారి ఇచ్చాడు.
క్రీడలపై రాజకీయాల ప్రభావం ఉండకూడదని
క్రీడలపై రాజకీయాల ప్రభావం ఉండకూడదని జస్టిస్ లోధా కమిటీ ఉత్తర్వులుండటంతో గంగూలీ పేరుని సీన్లోకి తెచ్చారు. గంగూలీ బస చేసిన హోటల్లోనే ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో బీసీసీఐ మాజీ అధ్యక్షులు శ్రీనివాసన్, అనురాగ్ ఠాకూర్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా, భారత బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ సమావేశమయ్యారు.
మంతనాల్లో సౌరవ్ గంగూలీ సైతం
ఈ మంతనాల్లో సౌరవ్ గంగూలీ కూడా పాలు పంచుకున్నాడు. ఈ సమయంలోనే ఢిల్లీలోని పెద్దలు జోక్యం చేసుకుని ఫోన్లోనే తగిన ఆదేశాలివ్వడంతో శ్రీనివాసన్ వెనక్కి తగ్గాడు. అంతేకాదు ఈ సమావేశం అనంతరం అధ్యక్ష పదవికి గంగూలీ నామినేషన్ వేస్తారని మీడియాకు చెప్పాల్సిందిగా శ్రీనివాసన్ తెలిపాడు. చర్చల అనంతరం ఆదివారం రాత్రి 12.45 సమయంలో హోటల్ లాబీలోకి వచ్చిన గంగూలీ నేను రేసులో ఉన్నాను అని అధికారికంగా ప్రకటించాడు.
అక్టోబర్ 23న
ఈ సందర్భంలో మరోసారి విలేకరులు ప్రశ్నించగా "రెండు గంటల క్రితం వరకు నాకే తెలియదు. అందుకే మీరు అడిగినప్పుడు బ్రిజేశ్ అవుతాడని చెప్పా. కానీ ఆ తర్వాత నిర్ణయం మారింది" అని గంగూలీ చెప్పాడు. గంగూలీ నామినేషన్ను బీసీసీఐ ఎన్నికల అధికారి ఎన్ గోపాలస్వామి సైతం ధృవీకరించారు. ఇక మిగిలిందల్లా అక్టోబర్ 23న గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టడమే.
నామినేషన్ అనంతరం గంగూలీ మాట్లాడుతూ
అయితే, నామినేషన్ అనంతరం గంగూలీ మాట్లాడుతూ "ఏ రాజకీయ నాయకుడు నాతో టచ్లో లేడు. నేను మాత్రం మమతా దీదీ(పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి)కి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఆమె మద్దతు నాకు లభించినందకు సంతోషంగా ఉంది. నేను ఎలాంటి డబ్బు తీసుకోలేదు" అని గంగూలీ తెలిపాడు. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. బెంగాల్ ఎన్నికల్లో గంగూలీని ప్రచారాస్త్రంగా వినియోగించుకునేందుకే గంగూలీ పేరుని తెరపైకి తీసుకొచ్చినట్లు వార్తలు వస్తుండటం విశేషం.
బెంగాల్ ఎన్నికల్లో గంగూలీ మద్దతుపై అమిత్ షా
ఈ వార్తలపై అమిత్ షా కూడా స్పందించారు. అమిత్ షా మాట్లాడుతూ "బీసీసీఐ అధ్యక్షుడు ఎవరు అనేది నేను నిర్ణయించలేదు. బీసీసీఐకి దాని సొంత ఎన్నికల ప్రక్రియ ఉంది'' అని అమిత్ షా చెప్పారు. గంగూలీ తనను కలవడంపై ‘‘ గంగూలీ నన్ను చూడటానికి రావచ్చు. నాకు చాలా సంవత్సరాలుగా క్రికెట్తో సంబంధం ఉంది. సౌరవ్ గంగూలీ నన్ను కలవడంలో ఎలాంటి హాని లేదు" అని అమిత్ షా వ్యాఖ్యానించారు.